అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ | BCCI Unlikely to Allow Afghanistan T20 league | Sakshi
Sakshi News home page

Apr 28 2018 6:59 PM | Updated on Mar 28 2019 6:10 PM

BCCI Unlikely to Allow Afghanistan T20 league - Sakshi

అఫ్గనిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లోగో

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)  సూపర్‌ సక్సెస్‌తో అన్ని దేశాలు ఆ దిశగా లీగ్‌లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 5 నుంచి 24 వరకు షార్జా వేదికగా టీ20 లీగ్ (ఏపీఎల్‌) నిర్వహించేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు తమ టోర్నీలో ఆడేందుకు అనుమతించాలని బీసీసీఐని కోరింది. ఈ ఏసీబీ విన్నపాన్ని బీసీసీఐ సున్నితంగా తిరస్కరించింది.

తమ ఆటగాళ్లు ఐపీఎల్లో మినహా మరే ఇతర టీ20 లీగ్ లోనూ ఆడరని స్పష్టం చేసింది. మీరు నిర్వహించే లీగ్‌కు అనుమతిస్తే... ఇతర దేశాలు కూడా అడుగుతాయని.. దానికి తాము సిద్ధంగా లేమని చెప్పింది. ఒక్క ఆటగాడిని అనుమతించినా... అందరినీ అనుమతించాల్సి వస్తుందని తెలిపింది. కనీసం బీసీసీఐ కాంట్రాక్టులో లేని ఆటగాళ్లనైనా పంపాలని ఏసీబీ కోరగా.. దానికి కూడా బీసీసీఐ ఒప్పుకోలేదు. తమ ఆటగాళ్లను పంపకపోయినా ఏసీబీకీ అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

‘భారత్‌ ఎప్పుడూ అఫ్గనిస్తాన్‌కు అండగా ఉంటుంది. ఆ దేశ క్రికెట్‌ బోర్డు అధికారులు భారత ఆటగాళ్లను తమ టీ20 లీగ్‌కు అనుమతించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో తమ ఆటగాళ్లను అనుమతించడం కష్టమని చెప్పాం. ఒకవేళ అనుమతిస్తే అన్ని దేశాలకు అనుమతిచ్చినట్లు అవుతుందని’ ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. అయితే బీసీసీఐ గతేడాది తొలిసారి ఒక యూసఫ్‌ పఠాన్‌కు మాత్రమే హాంగ్‌ కాంగ్‌ లీగ్ ఆడేందుకు అనుమతిచ్చింది. కానీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement