ఫైనల్లో ఆంధ్ర ఓటమి
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నీ విజేత బెంగాల్
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్కు అర్హత సాధించిన ఆంధ్ర జట్టు తుది పోరులో 11 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్ర జట్టులో నలుగురు రనౌట్ కావడం గమనార్హం. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు సాధించింది.
మందిర మహాపాత్ర (39 నాటౌట్), దీప్తి (34; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సీహెచ్ ఝాన్సీ లక్ష్మి మూడు వికెట్లు తీయగా... పుష్పలత, శరణ్యలకు ఒక్కో వికెట్ లభించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 49.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అనూష (61; 5 ఫోర్లు), పద్మజ (38; 4 ఫోర్లు) ఆకట్టుకున్నా... కీలకదశలో ఔటవ్వడం ఆంధ్ర విజయావకాశాలపై ప్రభావం చూపింది.
సంబంధిత వార్తలు