ఆసియా కప్ క్రికెట్ బంగ్లాదేశ్లోనే జరుగుతుందని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రకటించింది. టోర్నీలో ఆడేందుకు ఇన్నాళ్లూ తటపటాయించిన పాకిస్థాన్ జట్టు...
ఢాకా: ఆసియా కప్ క్రికెట్ బంగ్లాదేశ్లోనే జరుగుతుందని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రకటించింది. టోర్నీలో ఆడేందుకు ఇన్నాళ్లూ తటపటాయించిన పాకిస్థాన్ జట్టు... ఇప్పుడు అంగీకరించడంతో ఈ ప్రకటన వెలువరించింది. పాక్ టీమ్కు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
‘సహజంగానే ఉపఖండపు దేశాల్లో టోర్నీల్లో ఆడేందుకు ఏ జట్టుకైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. పాక్ భద్రతాధికారి శనివారం వచ్చి పరిస్థితిని సమీక్షిస్తారు. అయితే జట్టు ఆడటం మాత్రం ఖాయమైంది. ఈ నెల 22న పాక్ టీమ్ ఢాకా చేరుకుంటుంది’ అని ఏసీసీ సీఈ అష్రాఫుల్ హఖ్ వెల్లడించారు. ఫిబ్రవరి 25నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లతో పాటు తొలి సారి అఫ్ఘనిస్థాన్ కూడా బరిలోకి దిగుతోంది. మొత్తం 11 మ్యాచ్లలో ఐదింటిని ఫతుల్లాలో, ఫైనల్ సహా ఆరు మ్యాచ్లను మిర్పూర్లో నిర్వహిస్తారు.