నాకు ఆమె డబ్బింగా! | Bhanupriya joins Keerthy Suresh Mahanati | Sakshi
Sakshi News home page

నాకు ఆమె డబ్బింగా!

Apr 17 2018 7:11 AM | Updated on Apr 17 2018 9:58 AM

Bhanupriya joins Keerthy Suresh Mahanati - Sakshi

కీర్తీసురేశ్‌

సాక్షి సినిమా: నా పాత్రకు ఆ నటి డబ్బింగ్‌ చెప్పారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ ఇంతకు ముందు నటించిన చిత్రాలు వేరు, తాజాగా నటించిన నడిగైయార్‌ తిలగం చిత్రం వేరు. ఈ చిత్రం కీర్తీసురేశ్‌కు ప్రత్యేకం అన్న మాట చాలా చిన్నదే అవుతుంది. మహానటి సావిత్రి పాత్రలో నటించే అవకాశం రావడం అంత సులభం కాదు. ఆమెలా నటించడం సాధారణ విషయం కాదు. సావిత్రి జీవిత చిరిత్రతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ మహానటి పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రల్లో సమంత, దుల్కర్‌సల్మాన్, మోహన్‌బాబు, విజయ్‌దేవరకొండ ఇలా పలువురు నటిస్తున్నారు. నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కీర్తీసురేశ్‌ పాత్రకు సీనియర్‌ నటి భానుప్రియ డబ్బింగ్‌ చెప్పారనే ప్రచారంసామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి స్పందించిన కీర్తిసురేశ్‌ తన పాత్రకు నటి భానుప్రియ డబ్బింగ్‌ చెప్పారనే ప్రచారంలో నిజం లేదన్నారు.

రెండుభాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నానని, ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్‌ పూర్తి చేశానని, నడిగైయార్‌ తిలగం తమిళ వెర్షన్‌కు ప్రస్తుతం డబ్బింగ్‌ చెబుతున్నానని పేర్కొన్నారు. నటి భానుప్రియ ఈ చిత్రంలో నటించారన్నారు. మొత్తం మీద ఈ ద్విభాషా చిత్రంలో నటి భానుప్రియ కూడా నటించారన్న విషయాన్ని కీర్తీసురేశ్‌ వెల్లడించారు. అయితే అది ఏ పాత్ర అన్నది ఆసక్తిగా మారిందిప్పుడు. ఇదిలా ఉండగా నటి కీర్తీసురేశ్‌ తాజాగా తన పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారట. అందులో తన చిత్రాలవివరాలను అభిమానులు తెలుసుకునేఅవకాశం ఉంటుందన్నమాట. 

Advertisement
 
Advertisement
Advertisement