‘యువ తెలంగాణ’ ఆవిర్భావం | Yuva Telangana Political Party Is Launched | Sakshi
Sakshi News home page

Sep 6 2018 2:10 AM | Updated on Sep 6 2018 2:10 AM

Yuva Telangana Political Party Is Launched  - Sakshi

హైదరాబాద్‌ : రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనుకున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. బుధవారం హోటల్‌ టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన జిట్టా.. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తోందన్నారు. మంత్రి వర్గంలో వారికి చోటు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.

1999లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి యువజనుల ఉన్నతికి కృషి చేసినట్లు చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువ తెలంగాణ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్‌ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ జయ శంకర్‌ను విస్మరించి హరికృష్ణకు స్మారక ఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ట్యాంక్‌బండ్‌పై జయశంకర్‌ విగ్రహం పెట్టి స్మారక ఘాట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఇంటికో ఇటుకతో తామే విగ్రహాన్ని నిర్మించుకుంటామన్నారు. 

పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. 
పార్టీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రాణి రుద్రమ, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్‌ కృష్ణ, 12 మంది సభ్యులను ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement