చంద్రబాబుకి ఓటేస్తే భవిష్యత్ నాశనమే : వైఎస్‌ షర్మిల | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకి ఓటేస్తే భవిష్యత్ నాశనమే : వైఎస్‌ షర్మిల

Published Fri, Apr 5 2019 1:25 PM

YS Sharmila Speech In Tanuku Public Meeting - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ఐదేళ్లుగా అధికారంలో ఉండి ఏమి చేయని చంద్రబాబు ఇప్పుడు ‘ మీ భవిష్యత్‌ - నా బాధ్యత’  అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్‌ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్‌ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’  అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

రాజన్న రాజ్యం ఎలా ఉండేది?
తణుకు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.  ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం​ మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు.



ఆ డబ్బంత ఏమైంది?
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్‌ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు.  అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.

ఇది పుత్ర వాత్సల్యం కాదా?
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.

బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు కానీ..
ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేశారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. కానీ హోదా తేలేకపోయారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. అంటే చంద్రబాబు ఎప్పుడు ఎలా మాట మారుస్తారో ఆయనకే తెలియదు. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది.

నిజం చెప్పే దమ్ము చంద్రబాబు లేదు
దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అఖరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చెయించారు. చంద్రబాబు ఇవాళ యూటర్న్‌ తీసుకొని హోదా అంటున్నాడు అంటే దానికి కారణం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాదా? చంద్రబాబుకు నిజం చెప్పే దమ్ములేదు. చంద్రబాబు నెత్తి మీద శాపం ఉందట. ఏ రోజు అయితే చంద్రబాబు నిజాలు మాట్లాడుతాడో ఆ రోజు తల వేయ్యి ముక్కలు అవుతాయట. అందుకే చంద్రబాబు నిజం మాట్లాడరు. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్‌ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌, జనసేనను, కేజ్రీవాల్‌ను, ఫరూక్‌ అబ్దుల్లాను గుంపుగా వేసుకొని తిరుగుతున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు.

ఓటు వేయమని వస్తే చంద్రబాబును ఇవి అడగండి
గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి.

రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి
ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృషంరాజును, తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగేశ్వరరావును జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Advertisement
Advertisement