
విశాఖ నగరం సిరిపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తీ లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు పాలనలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించకపోగా అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 259వ రోజు సోమవారం విశాఖ నగరం సిరిపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, పుష్కరాల పేరుతో రూ.3,200 కోట్లు దోచేశారని ధ్వజమెత్తారు. ఈ సమ్మేళనంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
మనసు చెప్పినట్టు వినకపోతే భ్రష్టు పట్టడమే..
‘‘విశాఖపట్నంలో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదికపై ఉన్న పలువురు బ్రాహ్మణ పెద్దలు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ మీ అందరి నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుని వాటన్నింటినీ క్రోడీకరించి మీ అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తా. ప్రతి మనిషిలోనూ మనసు అనేది ఒకటి ఉంటుంది. తప్పు చేస్తున్నప్పుడు ఈ మనసు మనిషితో మాట్లాడుతుంది. అప్పుడు మనసు చెప్పేది వినగలిగితే ఆ మనిషి ఆ తప్పు చేయడు. అలా మనసు చెప్పే మాటను వినకుండా ఆ తప్పును సమర్థించుకోవడం మొదలు పెడతారో అప్పుడు రాజకీయాలు భ్రష్టుపడతాయి. మనషులు భ్రష్టుపడతారు. మనిషి తప్పు చేయకుండా ఉండాలి అంటే కచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఆ దేవుడికీ మనిషికి సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని నిలబెట్టే విషయంలో మనిషికీ, దేవుడికి మధ్య ఉన్న వారధులు బ్రాహ్మణులు అని చెప్పడానికి గర్వపడుతున్నా.
ఇతర కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి వారధులు ఉన్నారు. చర్చిలో అయితే పాస్టర్లు, ఫాదర్లు అని, మసీదులో అయితే ఇమామ్లు అని అంటారు. ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్లంతా దేవుడికి, మనిషికి మధ్య వారధులు. వీళ్లు అందరూ సంతోషంగా ఉంటేనే మన శ్రేయస్సుకు సంతోషంగా పని చేసినట్టవుతుంది. ఇవాళ ఒకసారి ఈ వారధుల పరిస్థితిని.. ప్రత్యేకించి ఇది బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం కాబట్టి.. ఇక్కడ వాళ్లకున్న సమస్యలను, పరిస్థితులను పరిశీలిస్తే బాధనిపిస్తుంది. నాకున్న అవగాహనతో చెప్పాల్సి వస్తే వీరి పరిస్థితి దయనీయం. పేదరికంతో అల్లాడుతున్నారు. చదువులు దేవుడిచ్చిన వరం వీరికి. ఆ చదువులతోనే కాస్తోకూస్తో నెట్టుకు వస్తున్నారు. ఇవాళ వీరిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. అర్చక వృత్తిని ఎందుకు చేస్తున్నామా.. అని ఆందోళన స్థితిలో ఉన్నారు బ్రాహ్మణ సోదరులు. ఈ వృత్తి చేసినా కడుపుకు భోజనం పెట్టలేని స్థితి. ఇంతటి దయనీయ స్థితి. వీళ్లకు మంచి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న పాలన గురించి చెప్పాలి.
ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చని బాబు
ఎన్నికలకు పోబోయే ముందు ఈ పెద్దమనిషి చంద్రబాబు ఫొటోకు ఫోజులు ఇచ్చి, అట్టహాసంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. కొన్నింటికి రెండు, మూడు పేజీలు కూడా కేటాయించాడు. బ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ పెద్దమనిషి. ఆర్థిక స్థోమత లేని దేవాలయాలలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న పూజారులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తానన్నారు. ఆ రోజుల్లో ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఏకంగా 14 వేల గుడులకు ధూపదీప నైవేద్యం స్కీం తీసుకువచ్చి తోడుగా నిలబడ్డారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ స్కీం కింద ఉన్న ఆ 14 వేల గుళ్లను 3 వేలకు తగ్గించారు. మంచి చేస్తానని చెప్పి మోసం చేశారు. 60 ఏళ్లు దాటిన పేద బ్రాహ్మణులకు ఆయుష్మాన్ భవ పథకం కింద నెలకు రూ.1000 పింఛన్ ఇస్తామన్నారు. 60 ఏళ్ల కథ దేవుడెరుగు 65 ఏళ్లు దాటిన బ్రాహ్మణులకైనా పెన్షన్ వస్తోందా? బ్రాహ్మణులకే కాదు.. మిగతా వారికి కూడా పెన్షన్లు రావడం లేదని దారిపొడవునా ప్రజలు నాకు చెబుతున్నారు.
అర్హులైన పేద బ్రాహ్మణులకు ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మిస్తానన్నాడు. కనీసం ఒక్కరికైనా ఇచ్చారా? శివార్చకులను బీసీ–డి కింద గుర్తించి చట్ట సవరణ చేస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఈ హామీ బాబుకు గుర్తుకు రాలేదు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, ఇతర సేవకులకు తాము సర్వీసు చేసినంత కాలం ఈనామ్ భూములు అనుభవించే హక్కును కొనసాగిస్తామన్నాడు. నిజానికి ఈ హక్కు ఇంతకు ముందే ఉంటే ఇక్కడ చంద్రబాబు చేసేది ఏముంది? ఇది కూడా ఎన్నికల ప్రణాళికలో పెట్టి.. అదేదో పెద్ద మేలు చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. చేసిందేమీ లేదు. దేవాలయాల్లోని పూజారులకు పదవీ విరమణ ఉండదని చెప్పాడు ఈ పెద్దమనిషి. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన మాట ఇది. నిజంగా ఆ తర్వాత చేసిందేమిటి? రమణ దీక్షితులు విషయంలో ఈ చంద్రబాబు ఏం చేశారు? 65 ఏళ్లు దాటితే ఏ బ్రాహ్మణుడిని కూడా అర్చక పదవిలో కొనసాగించడం కుదరదని ఏకంగా జీవో తెచ్చి బలవంతంగా పదవీ విరమణ చేయించి రమణదీక్షితుల్ని ఇంట్లో కూర్చోబెట్టిన సంఘటన చూశాం. ఇంతకన్నా దారుణం ఏమీ ఉండదు.
వంశపార్యంపర్య హక్కులకు తూట్లు
ఆ రోజుల్లో నాన్నగారు ఎండోమెంట్ చట్టాన్ని సవరించి మిరాశీ వ్యవస్థను తిరిగి తెచ్చి వంశపార్యంపర్య హక్కుల్ని కల్పించారు. ఆ చట్టం తీసుకువచ్చి 11 ఏళ్లు అయినా అమలు చేయకపోగా చివరకు ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు సరికొత్త జీవోలను తీసుకువస్తున్నారు. బ్రాహ్మణులు వంశపారంపర్యంగా అర్చక వృత్తి చేయకుండా ఉండేలా తూట్లు పొడుస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తానని మరో హామీ ఇచ్చారు. ఇచ్చేదేమిటని ప్రశ్నిస్తున్నా. దేవుడి దయ వల్ల బ్రాహ్మణులు అందరూ బాగా చదువుకున్న వ్యక్తులు. మన పక్కనే ఉన్న ఐవీఆర్ కృష్ణారావు లాంటి వారు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి ఎదిగిన వ్యక్తి. వీళ్లందరికీ సముచిత స్థానం కల్పించే మాట దేవుడెరుగు వీళ్లందర్నీ అగౌరవ పరుస్తూ ఉద్యోగాలలో నుంచి తీసివేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.
ఆస్తుల పరిరక్షణ అంటే ఇదేనా?
దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షిస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ఈయన చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి. పక్కనే విజయవాడలోని కనక దుర్గమ్మ దేవస్థానం భూములు కనిపిస్తాయి. ఒక్కో ఎకరా రూ.వంద కోట్ల విలువ చేసే 11 ఎకరాల దేవస్థానం భూములను సిద్ధార్థ అనే ప్రైవేటు కాలేజీకి ఎకరానికి ఏడాదికి రూ.లక్ష చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇదీ ఆయన చేస్తున్న పరిరక్షణ. ఇక, సదావర్తి గుడి భూములు.. చెన్నైలో 84 ఎకరాల భూమి ఉంది. రిజిస్ట్రేషన్ విలువే ఎకరా రూ.7 కోట్లు. మార్కెట్ విలువ రూ.12 కోట్లు. కానీ ఈ పెద్దమనిషి ఆ భూముల్ని ఎకరా రూ.27 లక్షల చొప్పున కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. అక్కడకు వెళ్లి ఇంతటి దారుణమా? అని ప్రశ్నించి కోర్టులో కేసు వేసి అంతకన్నా ఎక్కువ ఇస్తాం అని చెప్పి ఈ భూములపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తే తప్ప వెనకడుగు వేయని పరిస్థితి.
గుడికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం అంటే ఇదేనా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిపులు.. బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏటా రూ.3 లక్షల దాకా పెంచుతానని చెప్పి అవహేళన చేస్తున్నాడు చంద్రబాబు. ఒకవైపున దగ్గరుండి కాలేజీల ఫీజులు పెంచిస్తున్నారు. ఈ మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఫీజులకు రెక్కలొస్తున్నాయి. ఫీజులు లక్షలు దాటుతుంటే చంద్రబాబు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటేమో ముష్టి వేసినట్టు రూ.30 వేలు, 35 వేలకు మించడం లేదు. అది కూడా రెండేళ్లుగా ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
చెప్పిందేమిటి.. చేసిందేమిటి బాబూ?
చంద్రబాబు చెప్పిన మొట్టమొదటి హామీలో బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం రూ.500 కోట్లతో బ్రాహ్మణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరానికి వంద కోట్ల రూపాయలతో ఐదేళ్లలో 500 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ కార్పొరేషన్ వస్తుందీ అని ఆశ పడ్డాం. కానీ ఈ పెద్దమనిషి తన నాలుగున్నర ఏళ్ల పాలలో ఇచ్చింది ఎంతో తెలుసా? అక్షరాలా కేవలం రూ.165 కోట్లు. ఎక్కడ రూ.500 కోట్లు, ఎక్కడ రూ.165 కోట్లు.. ఒక్కసారి ఆలోచించండి. ఉపకార వేతనాలు, పింఛన్ నిధులూ ఇందులో నుంచేనట. ఈ పెద్దమనిషికి గుడిలో దేవుడన్నా భక్తి లేదు.. భయమూ లేదు. ఈ రెండు లేని వ్యక్తి.. కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు ఒక్కరే. గుడికి సంబంధించింది ఏదైనా చేయాలి అంటే ఎంతటి అన్యాయస్తుడైనా భయపడతారు. దేవుడు పై నుంచి చూస్తాడు.. మొటిక్కాయలు వేస్తారేమోనని భయపడతారు. అట్లాంటిది ఈ పెద్దమనిషి గోదావరి, కృష్ణా పుష్కరాల పేరు చెప్పి రూ.3,200 కోట్లు దోచేశారు. ఇంతగా దోచేసిన పరిస్థితి మనం ఎక్కడా చూసి ఉండం.. ఒక్క మన రాష్ట్రంలో తప్ప. నామినేషన్ పద్ధతిలో ఇష్టానుసారంగా రేట్లు పెంచి కమీషన్లు తీసుకొని పనులు అప్పగించిన పరిస్థితిని గోదావరి, కృష్ణా పుష్కరాలలో చూశాం.
అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలా..
ఇవాళ విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరగడం చూశాం. అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలేమిటని ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇటువంటి విన్యాసాలు ఈ చంద్రబాబు పాలనలో మాత్రమే చూస్తున్న పరిస్థితి. ఇదే పెద్ద మనిషి హయాంలో గుడులలో శుభ్రం చేసే పనుల్లో కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచి తన బంధువులకు పనులు కేటాయిస్తున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు అన్నవరం దేవస్థానంలో ఈ పనులకు నెలకు రూ.7 లక్షలు ఖర్చు చేసేవారు. ఈ మనిషి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క అన్నవరమే కాకుండా చాలా దేవస్థానాలను కలిపి తన బంధువు భాస్కర్నాయుడుకు కాంట్రాక్ట్ అప్పగించాడు. రేట్లు పెంచి నెలకు రూ.32 లక్షలకు ఇచ్చాడు. ఒక్కొక్క గుడికి నెలకు రూ.7 లక్షలు ఉంటే దాన్ని ఏకంగా రూ.32 లక్షలకు పెంచి తన బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చేసి అక్కడ కూడా కమీషన్లు తీసుకుంటున్న పరిస్థితి దేశంలో ఎక్కడా ఉండదేమో? ఈ విధంగా దేవుణ్ణి కూడా అమ్మేసే వ్యక్తి ఎక్కడా ఉండడేమో ఈ చంద్రబాబు తప్ప.
ఐవీఆర్కి జరిగిన అవమానాన్నీ జీర్ణించుకోలేం
ఐవీఆర్ కృష్ణారావు, రమణ దీక్షితుల గురించి చెప్పాల్సిన పని లేదు. బ్రాహ్మణులలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలా అరుదు. ఆ స్థాయిలో ఈ ఇద్దరూ ఉన్నారు. వాళ్లిద్దరికీ జరిగిన అవమానం నిజంగా జీర్ణించుకోలేనిది. అంతగా అవమానించారు. ఇంతటి దారుణమైన పరిపాలన. చివరకు తిరుపతిలో పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందంటే.. రమణ దీక్షితులు ఆరోపిస్తున్నట్టుగా హుండిలోని కానుకలు, నగలు కూడా మాయం అవుతున్నాయన్న పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారింది. ఈపాలన గురించి నేను చెప్పాల్సింది చెప్పా. రేప్పొద్దున దేవుడు అశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తే బాగుంటుందన్న అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వమని అందరినీ కోరుతున్నా. వేదికపై ఉన్న పెద్దలు ఇచ్చారు. వారితో పాటు మీరూ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రతి సూచననూ స్వీకరిస్తా. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అత్యధికంగా అమలు చేసేందుకు, మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నా. మీ అందరి ముఖాల్లో సంతోషం నింపుతానని చెబుతున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు.
బ్రాహ్మణుల ఆశాదీపం వైఎస్ జగన్
రాష్ట్రంలో టీడీపీ పాలనలో బ్రాహ్మణులు అన్ని రంగాల్లోనూ అణిచి వేయబడ్డారు. మళ్లీ వారికి పూర్వ వైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. ఆ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడారు. అంతటి వీరోచితమైన సాహసాలు చేసే నాయకుడు వైఎస్ జగన్. జగన్ నాయకత్వంలో బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది. – పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయచందర్
మా ఆశలన్నీ మీ పైనే..
బ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.500 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు ఆ మొత్తం కేటాయించలేదు. బ్రాహ్మణులను అన్నివిధాలుగా అణిచి వేస్తున్నారు. మా ఆశలన్నీ మీపైనే. మీరు అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్జెట్లో ఏడాదికి రూ.300 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1500 కోట్లు కేటాయించాలి. రాజన్న పెళ్లి కానుక కింద పేద బ్రాహ్మణ వధువులకు రూ.లక్ష అందజేయాలి. ధూపదీప నైవేద్యాల కోసం మీ తండ్రి రాజశేఖరరెడ్డి ప్రతి నెలా రూ.2,500 కేటాయించి అర్చకులను ఆదుకున్నారు. మీరు ఆ సాయాన్ని రూ.10 వేలకు పెంచాలి. జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాలకు పూర్వ వైభవం మీ ఒక్కరి వల్లే సాధ్యం.
– జి పురుషోత్తం, కుప్పం, చిత్తూరు జిల్లా
ఒడియా బ్రాహ్మణులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదన్నా..
అన్నా.. మేము చాలా ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి విశాఖలో స్థిరపడ్డాం. సుమారు 4 వేల మందికి పైగా ఇక్కడే జీవిస్తున్నాం. మాకు ప్రభుత్వ పథకాలు వర్తించాలన్నా, బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా కుల ధ్రువపత్రాలు కావాలంటున్నారు. అధికారులేమో ఇవ్వడం లేదు.
– నారాయణ, విశాఖపట్నం
వైఎస్సార్లో వేదాలు మిళితం..
మీరు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వైఎస్సార్లో వేదాలన్నీ మిళితమై ఉన్నాయి. మీరు యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ అన్నారు కానీ మా బ్రాహ్మణ పరిభాషలో వై అంటే యజుర్వేదం, ఎస్ అంటే సామవేదం, ఆర్ అంటే రుగ్వేదం. మీరు కూడా మీ నాన్నలా బ్రాహ్మణుల కోసం చిత్తశుద్ధితో పాటు పడతారనే నమ్మకం ఉంది.
– పురుషోత్తమ శర్మ, తెనాలి
మా సత్రాన్ని అప్పగించాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నా..
మా పూర్వీకులు 1935లో నర్సారావుపేటలో సత్రం నిర్మించారు. వితంతువులకు ఆశ్రయం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం 30/87 జీవో తీసుకువచ్చి ఈ సత్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేదు.
– మోహన్ మూర్తి, నర్సారావుపేట, గుంటూరు జిల్లా
సంబంధిత వార్తలు...
‘పచ్చ మీడియాను డిజప్పాయింట్ చేస్తున్నా’