ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్ : వైఎస్ భారతీ రెడ్డి
సాక్షి, సింహాద్రిపురం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకున్నారని ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి అన్నారు. వైఎస్ జగన్పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటింకి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు.
విలేకరులతో ఆమె మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ పథకం మోసమని డ్వాక్రా మహిళలు గమనించారని చెప్పారు. చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.