‘వైఎస్ జగన్కు పట్టం కట్టడం ఖాయం’
సాక్షి, చింతలపూడి : ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టడం ఖాయమని చింతలపూడి నియోజక వర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వీఆర్ ఎలీజా అన్నారు. చింతలపూడిలో బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో 30 సంవత్సరాల పాటు ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సొంత రాష్ట్రానికి వచ్చానని పేర్కొన్నారు. ఇకపై చింతలపూడి నియోజక వర్గ ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించి ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్కు బహుమతిగా ఇద్దామని ఎలీజా పిలుపునిచ్చారు.
వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులు..
ప్రత్యేక హోదా పోరులో భాగంగా ఇంకా ఏడాదికి పైగా సమయమున్నా ఎంపీ పదవిని తృణప్రాయంగా వదులుకున్న వైవీ సుబ్బారెడ్డి అభినందనీయులని ఎలీజా కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీల పోరాటానికి రాష్ట్ర ప్రజలంతా మద్దతుగా ఉండటం హర్షణీయమన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు రైతాంగానికి వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.