ఇంతకీ శవం ఎవరిదయ్యా లోకేష్‌? | Vijaysai Reddy satirical tweets on Nara Lokesh | Sakshi
Sakshi News home page

ఇంతకీ శవం ఎవరిదయ్యా లోకేష్‌?

Feb 20 2019 3:21 PM | Updated on Feb 20 2019 3:33 PM

Vijaysai Reddy satirical tweets on Nara Lokesh - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సభ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఓ అన్నదాత బలైపోతే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు నిస్సిగ్గుగా సాగిస్తున్న దుష్ప్రచారంపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా నిప్పులు చెరిగారు. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప‍్టర్‌లో వెళ్లాలా?. హెలిప్యాడ్‌ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్‌ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’  అంటూ ఘాటుగా ప్రశ్నించారు. 

చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య అనే రైతును దారుణంగా కొట్టి చంపిన ఘటనపై పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన క్రూర హత్య. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలి. మృతుడు పిట్టల కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనపై  కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. సిఎం, డిజిపిలను బాధ్యులుగా చేసి దర్యాప్తుకు ఆదేశించాలి. రాజకీయ అవసరాల కోసం రోజుకో రాష్ట్రం తిరిగే బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా?. కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాలా? హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు పాలనలో పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది అని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత ప్రాణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమయ్యాయి. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదదస్పదమవుతోంది. అప్పుల బాధతో పురుగు మందు తాగి చనిపోయాడంటూ బుకాయిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణిస్తే కనీసం కనికరం చూపని పాలకుల వైఖరిని ఈసడించుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement