‘లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్‌.. చంద్రబాబుకు పోలవరం’ | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు ప్రకాశం.. చంద్రబాబుకు పోలవరం ఇవ్వమంటారు!

Published Fri, Jun 7 2019 10:07 AM

Vijaya Sai Reddy Setires On Yanmala and Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇవ్వడం మొదలు పెడితే చంద్రబాబు కోసం పోలవరం, ఆయన పుత్రరత్నం నారాలోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ ఇవ్వమంటారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనపై చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. 

ఇక  రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ చంద్రబాబు రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు రాసే తొలి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని, కానీ తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా? పోతుందా అనే సంశయమనం తప్ప.. ఇంకేమి లేదని విజయసాయిరెడ్డి గురువారం ఈ లేఖపై వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా? అనే సందేహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‌పై యనమల ప్రెస్‌మీట్‌ పెట్టి మరి విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు రాసిన లేఖ మొదటిది కాదని, వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని లేఖరాసారని తెలిపారు.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ  మాఫియాను సృష్టించి  ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?’ అని మరో ట్వీట్‌లో విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement