
ఇక్కడి అభ్యర్థిని మార్చాలని, నియోజకవర్గ ప్రజల తరపున మరోసారి అధిష్టానాన్ని కోరతానని కోటిరెడ్డి ప్రకటించారు.
సాక్షి, నల్గొండ : గులాబీ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందులో భాగంగా కొందరు పార్టీని వీడుతుండగా మరికొందరు బీఫామ్లు ఇచ్చేంత వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అసమ్మతి నేత ఎంసీ కోటిరెడ్డి.. నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల నరసింహయ్యకు వ్యతిరేకంగా త్రిపురారంలో సోమవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా... నోముల.. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనకు ఇక్కడి గ్రామ రాజకీయాల మీద అవగాహన లేదని కోటిరెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డిలాంటి బలమైన అభ్యర్థిని ఓడించాలంటే.. టీఆర్ఎస్ స్థానిక నేతకు(తనకు) టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇక్కడి అభ్యర్థిని మార్చాలని, నియోజకవర్గ ప్రజల తరపున మరోసారి అధిష్టానాన్ని కోరతానని ఆయన ప్రకటించారు. అయినా బీఫామ్ ఇచ్చే చివరి నిమిషం వరకు నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో అందరితో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని కోటిరెడ్డి స్పష్టం చేశారు.