పద్మనాభంలో టీడీపీ ఖాళీ

TDp Leaders join in YSRCP Visakhapatnam - Sakshi

ఎనిమిది పంచాయతీల్లో ముఖ్యనేతలంతా  

వైఎస్సార్‌సీపీలో చేరిక రెండువేల మంది తీర్థం

విశాఖపట్నం, పద్మనాభం(భీమిలి): పద్మనాభం మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబునాయుడు నిన్న కాక మొన్న తమ పార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరకుండా ఉండకుండా కాపాడుకునేందుకు విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. పద్మనాభంలో  భీమునిపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి సబ్బం హరి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు ఆగలేదు. సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పాలనకు ఆకర్షితులైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. పద్మనాభం మండలంలో 21 పంచాయతీల్లో ఎనిమిది పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌లతో సహా రెండు వేల మంది సోమవారం పద్మనాభంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్‌ సీలో చేరారు.

టీడీపీకి చెందిన భీమునిపట్నం మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్, అనంతవరం మాజీ ఎంపీటీసీ గొర్రిపాటి పెద ఎర్రినాయుడు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు, బాందేవుపురం పంచాయతీ మాజీ సర్పంచ్‌ సాగి కృష్ణమూర్తిరాజు, ఇదే పంచాయతీ మాజీ సర్పంచ్‌లు గంగిరెడ్ల వెంకటరమణ, సింక సూరీడు, కొలుసు అప్పయ్యమ్మ, విలాస్కాన్‌పాలేనికి చెందిన మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బాయి వెంకట రమణ, విలాస్కాన్‌పాలెం మాజీ ఉప సర్పంచ్‌ బోని వెంకట రమణ తదితరులు పార్టీలో చేరారు. పెంట మాజీ సర్పంచ్‌ గొర్లె సోములమ్మ, గొర్లె బంగారునాయుడు, మద్ది చెందిన టీడీపీ సీనియర్‌ నేత బుగత ఎర్రినాయుడు, కాళ్ల ప్రకాష్, కాళ్ల అప్పలనాయుడు, కృష్ణాపురం మాజీ ఉప సర్పంచ్‌ సురాల పైడిరాజు, పొట్నూరు చెందిన అవనాపు శివ, కిలారి అప్పన్న, రఘుమజ్జి రాంబాబు, చేరిఖండం నుంచి వాడపల్లి రమేష్, బసవ  శ్రీనుతో సహా తమ అనుచరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పద్మనాభం మండలంలో టీడీపీ పని అయిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, వైఎస్సార్‌ రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర బంగారప్పడు,  జిల్లా అధికార ప్రతి«నిధి సిరుగుడి ఆదిబాబు,  మండల యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు పాల్గొన్నారు.   

జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి
సీఎం జగన్‌మోహనరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభం జెడ్పీ బంగ్లా వద్ద సోమవారం జరిగిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పద్మనాభం మండలంలో 5,600 మందికి రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మిస్తామన్నారు. పాండ్రంగిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంజూరైన రూ.2కోట్లతో వారం రోజుల్లోగా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రెడ్డిపల్లి శాంతినికేతన్‌ నుంచి నీలకుండీల జంక్షన్‌లో వరకు గల ఆర్‌అండ్‌బీ రోడ్డును విస్తరిస్తామన్నారు. మంచి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ పాలనపై రూపొందించిన  ఏపీ 24/7 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.  వైఎస్సార్‌ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర బంగారప్పడు, జిల్లా అధికార ప్రతినిధి సిరుగుడి ఆదినారాయణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, నాయకులు మొకర అప్పలనాయుడు, తాలాడ పద్మనాభం, మామిడి శివ రామకృష్ణ, కోండ్రోతు శ్రీనివాసరావు, రామసింగు ముత్యాలనాయుడు, బాయి అప్పలస్వామి, బుగత శ్రీను పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top