టీడీపీకి ఓటేయకపోతే అంతుచూస్తాం

TDP Leaders Are Bullying Chandragiri Voters - Sakshi

దళితులపై అధికారపార్టీ నాయకుల దౌర్జన్యం

మహిళలని చూడకుండా దుస్తులు చింపేసి దాడులు..

పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో భయానక వాతావరణం

చంద్రగిరి(చిత్తూరు జిల్లా) : అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం శ్రుతిమించింది. ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే అంతుచూస్తామంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దళితులపై దాడులకు దిగారు. చంద్రగిరి మండలం పనపాకం దళితవాడలో ఈ అమానుషం చోటు చేసుకుంది. టీడీపీ నుంచి పసుపు–కుంకుమ తీసుకుంటున్నారు కదా! మీరు కానీ టీడీపీకి ఓటు వేయకపోతే అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. మూడురోజులుగా రోజూ రాత్రి పూట దళితవాడ వాసుల వద్దకు వెళ్లి భయపెడుతూ వస్తున్న టీడీపీ నేతలు శనివారం రాత్రి శ్రుతిమించి వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, జూపార్క్‌ డైరెక్టర్‌ మణి యాదవ్, ఆ పార్టీ నాయకులు రమేష్, గురవయ్య, రాజారత్నం, వారి అనుచరులు కలసి మూకుమ్మడిగా దళితవాడలోకి వెళ్లి బీభత్సం సృష్టించారు. కనపడిన వారందరినీ చితకబాదారు. చివరకు మహిళలు, పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. మహిళల బట్టలు చింపేయడమేగాక.. తరిమి తరిమికొట్టారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా దాడి చేశారు. అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ వారిని బెదిరించారు. 

రక్షణ కల్పించండి : టీడీపీ నేతల దాడులతో భయాందోళనకు గురైన పనపాకం దళితవాడ వాసులు తమకు రక్షణ కల్పించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. కనీసం మహిళలని కూడా చూడకుండా టీడీపీ నాయకులు విచక్షణరహితంగా దాడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఓటు వేసుకోవడాన్ని కూడా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top