'యామనీ' గోల

TDP Leader Yamini Bala Family Corruption Story - Sakshi

 తల్లి, తమ్ముడి కనుసన్నల్లో యథేచ్ఛగా దోపిడీ

ప్రతి పనికీ ఓ ధర సొంతపార్టీ వారినీ ఉపేక్షించలేదు

అధికారుల పోస్టింగ్‌ల్లోనూ వసూళ్లు

ఇసుక దందాలో నిలువుదోపీడీ

గాలిమరల ఏర్పాటులోనూ అక్రమ వసూళ్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్, అనంతపురం   :మెరుగైన సమాజం ఉపాధ్యాయులతోనే నిర్మితమవుతుందనేది అక్షర సత్యం. మరి అంతటి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం అభివృద్ధి ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే శింగనమల నియోజకవర్గం విషయంలో ఇది తారుమారైంది. ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల ఆశలు ఆడియాసలు చేస్తూ.. ఎవరేమైపోతే నాకేంటి అనే ధోరణితో అడ్డగోలు దోపిడీకి తెరలేపారు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినీబాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి. ఐదేళ్ల పదవీ కాలంలో వీరిద్దరి పదవులను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీ తనయుడు అశోక్‌ సాగించిన అక్రమాలు లెక్కకు మించే ఉన్నాయి. ఉద్యోగుల బదిలీల్లో లంచాలు, నీరు–చెట్టు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు, ఇసుక దోపిడీ, బినామీ పేర్లతో ప్రభుత్వ భూముల కబ్జా.. ఇలా ఒకటేమిటీ.. అన్ని విషయాల్లోనూ తల్లి, సోదరి అండతో అశోక్‌ చక్రం తిప్పాడు. అంచనాలకు మించి రూ. కోట్లకు పడగలెత్తారు.  

అప్పు చేసి.. ఎన్నికల్లో పోటీ చేసి
తల్లి శమంతకమణి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో యామిని బాల నామినేషన్‌ వేశారు. అంతకు ముందు ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా.. మండల విద్యాధికారిగా ఆమె పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆ కాలంలో ఆమెకొచ్చే జీతం అంతంతమాత్రమే. ఎన్నికల్లో ఖర్చుల కోసం హైదరాబాద్‌లో తన పేరున ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకున్నారు. అ దృష్టం కలిసొచ్చి ఒకే ఇంటిలో కుమార్తెకు ఎమ్మెల్యే, తల్లికు ఎమ్మెల్సీ పదవులు వరించాయి. ఎన్నికైన తర్వాత సేవ అనే పదానికి వీరు అర్థం మార్చేశారు. రాజకీయాలను అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రజలు అప్పగించిన లైసెన్స్‌గా భావించినట్లున్నారు. తమ్ముడు అశోక్‌ను అన్నింటా కీలకంగా మార్చేశారు. ఏ పనిచేయాలన్నా అశోక్‌ను ముందుగా కలవాలి అనే నిబంధనతో ఎన్నికైనప్పటి నుంచి దోపిడీకి తెరలేపారు. ఈ ఐదేళ్లలోపు ఎమ్మెల్యే యామిని రూ. కోటితో అనంతపురంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టగా.. తమ్ముడు ఆరు అంతస్తుల కాంప్లెక్స్‌ను నిర్మించుకుంటున్నాడు. 

సొంత పార్టీ వారైనా సరే..  
శింగనమల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా.. అందులో ఐదు శాతం కమీషన్‌ ఎమ్మెల్యేకు కట్టి తీరాలి. లేకపోతే ఆ పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. చివరకు సొంత పార్టీ వారైనా సరే ఎమ్మెల్యేకు ఐదు శాతం కమీషన్‌ చెల్లించి తీరాలి. శింగనమలలో ఐసీడీఎస్‌ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఓ టీడీపీ నాయకుడు దక్కించుకున్నాడు. ఎమ్మెల్యేకు కమీషన్‌ చెల్లించకుండా అతను పనులు మొదలు పెట్టడం ఎమ్మెల్యే, ఆమె సోదరుడు అశోక్‌కు నచ్చలేదు. దీంతో పనులు జరుగుతున్న ప్రాంతానికి మండల స్థాయి అధికారిని పంపి ఆగమేఘాలపై నిర్మాణ పనులు అడ్డుకున్నారు. చివరకు ఎమ్మెల్యేను ఆ టీడీపీ నేత కలిసి ఐదు శాతం కమీషన్‌ ముట్టజెప్పిన తర్వాత పనులు మొదలు పెట్టించారు.  

శింగనమల మండలంలో అక్రమాలు ఇలా..
నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో నీరు–చెట్టు పథకం కింద దాదాపు రూ.70 కోట్లు పనులు చేపట్టారు. ఈ పనుల్లో 5 శాతం చొప్పున రూ. 3.50 కోట్ల కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నారు.  
శింగనమల, సలకంచెరువు గ్రామాల్లోని చెరువులలో దాదాపు రూ.3 కోట్లతో నీరు–చెట్టు కింద పనులు చేశారు. ఈ పనులను బినామీలతో ఎమ్మెల్యే తమ్ముడు అశోక్‌ చేయించాడు.  
రూ. 4 కోట్ల నాబార్డు నిధులతో శింగనమల చెరువులో చేపట్టిన పనుల్లోనూ ఐదు శాతం కమీషన్‌ ఎమ్మెల్యేకు ముట్టినట్లు టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు.  
రైతు రథం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని లబ్ధిదారులకు అందజేశారు.   
శింగనమల మండలం రాచేపల్లి గ్రామం నుంచి ఆనందరావుపేట వరకు తారురోడ్డు వేసేందుకు రూ. 90 లక్షలు మంజూరు కాగా, ముందస్తుగానే రూ. 4.50 లక్షలు కమీషన్‌ తీసుకుని పనులకు అనుమతులిచ్చారు.  

మొక్కల పెంపకం పేరుతో రూ.1.16 కోట్లు స్వాహా
నియోజకవర్గంలోని 116 గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకానికి జాతీయ ఉపాధీ హమీ పథకం కింద రూ.1.16 కోట్లు మంజూరయ్యాయి.  ఎక్కడా ఒక్క మొక్క కూడా కనిపించకపోయినా.. నిధులు మాత్రం స్వాహా చేసేశారు. 

తమ్ముళ్లకు ఆన్‌లైన్‌లో భూములు
శింగనమల మండలంలో భూపంపిణీ జరగలేదు. అయితే రెవెన్యూ అధికారులను బెదిరించి ఆన్‌లైన్‌లో దాదాపు 400 ఎకరాలకు టీడీపీ తమ్ముళ్ల పేర్లతో రికార్డులు సృష్టించారు. ఈ ఆన్‌లైన్‌ భూములను బ్యాంకుల్‌ తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకున్నారు.   

బుక్కరాయసముద్రం మండలంలో...
బుక్కరాయసముద్రంలోని గాంధీ నగర్‌ కాలనీలో నార్పల రహదారి పక్కన 3 సెంట్ల స్థలాన్ని బినామీ పేరున పట్టా  చేయించుకుని, రూ. 4 లక్షలకు అమ్ముకున్నారు.  
అనంతపురం, తాడిపత్రి ఫోర్‌లైన్‌ రోడ్డు పనుల్లో భాగంగా బీకేయస్‌లోని నార్పల క్రాసింగ్‌ నుంచి అనంతపురం చెరువు కట్ట వరకూ రూ.13 కోట్లతో చేసిన పనుల్లో రూ. 26 లక్షల కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నట్లు సమాచారం.  
జంతలూరు వద్ద సెంట్రల్‌ యూనివర్సిటీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మించారు. ఇందులోనూ ఎమ్మెల్యేకు రూ. 54 లక్షల మేర ముడుపులు అందాయి.  
గోవిందపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని రేగడి కొత్తూరు గ్రామానికి వెళ్లే దారి పక్కన సర్వే నంబరు 14–1లో 2.31 ఎకరాలు, 14–2లో 2.31 ఎకరాలు కలిపి  4.62  ఎకరాల భూమిని బినామీ పేర్లుతో ఎమ్మెల్యే తమ్ముడు అశోక్‌ చేయించుకున్నాడు.  ఈ పొలాలను కొట్టాలపల్లికి చెందిన దూదేకుల వన్నూరప్ప గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడు.  

పుట్లూరు మండలంలో ఇలా..
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూ పంపిణీ జరుగలేదు. అయితే పుట్టూరు మండలంలో 800 ఎకరాలకు పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డదారుల్లో పట్టాలు పొందారు.  
మండలంలోని గాలిమరల వద్ద చాలవేముల, గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల గ్రామాలకు చెందిన నిరుపేద రైతులు 35 మంది సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వీరి ఏర్పాటు విషయంగా ఏజెన్సీని బినామీల సాయంతో ఎమ్మెల్యే యామినీబాల తమ్ముడు అశోక్‌ నడుపుతున్నాడు. ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సంబంధించి రూ. 8 వేలను ఏజెన్సీ నిర్వాహకులకు కంపెనీ యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. అందులో రూ.3,800 పట్టుకుని రూ. 4,200 మాత్రమే గార్డులకు ఏజెన్సీ నిర్వాహకులు అందజేస్తున్నారు. ఈ లెక్కన సెక్యూరిటీ గార్డులను మోసం చేస్తూ నెలకు రూ.1.33 లక్షలు వెనకేసుకున్నారు. ఈ 48 నెలల్లో రూ. 63 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం.   
మడుగుపల్లి వద్ద గాలిమరల ఏర్పాటకు కంపెనీ నుంచి అప్పట్లో రూ.2 కోట్లు ముడుపులను ఎమ్మెల్యే యామినీ బాల దండుకున్నారు.  
ఈ విషయంలో ఎమ్మెల్యే సోదరుడికి ముందస్తుగానే రూ.50లక్షలు కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు. అయితే తనకు కాకుండా సోదరుడికి డబ్బు ఇవ్వడంపై– ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు రూ.2 కోట్లను కంపెనీ ప్రతినిధులు చెల్లించుకోవాల్సి వచ్చింది.  
పుట్లూరు మండలంలో రూ.13.75కోట్లతో చేపట్టిన నీరు – చెట్టు పనుల్లో ఐదు శాతం చొప్పున రూ. 80 లక్షల కమీషన్‌ను ఎమ్మెల్యే యామినీ బాల తీసుకున్నారు.   
ఏటా రబీలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ ఏజెన్సీ కేటాయింపు విషయంలో రూ.2లక్షలు చొప్పున ముడుపులు దండుకున్నారు. నాలుగేళ్లకు రూ. 8 లక్షలు అక్రమంగా వెనకేసుకున్నారు.  

గార్లదిన్నె మండలంలో..
43వ ప్యాకేజీ కింద రూ.450 కోట్లతో చేపట్టిన మిడ్‌ పెన్నార్‌ దక్షిణ కాలువ లైనింగ్‌ పనుల్లో  రూ. 2 కోట్ల వరకు ముడుపులను ఎమ్మెల్యే యామినీబాల, స్థానిక టీడీపీ నేతలు దండుకున్నారు.  
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మిడ్‌ పెన్నార్‌ డ్యాం నుంచి రూ. 40 కోట్ల వ్యయంతో పైప్‌లైన్‌ పనులు చేపట్టారు. ఈ పనుల్లో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే రూ. కోటి వరకు కమీషన్ల రూపంలో తీసుకున్నారు.  
కొప్పలకొండ, ముంటిమడుగు, ఇల్లూరు, కల్లూరు గ్రామాల పరిధిలోని పెన్నానది పరివాహాక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా  తరలించి రూ. కోట్లు కొల్లగొట్టారు.  
రామదాసుపేట వద్ద నల్లగుట్ట ప్రాంతం అంతా బినామీ పేరు మీద ఎమ్మెల్యేకు రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు.
రామదాసుపేట గ్రామంలో నల్లగుట్ట వద్ద తక్కువ ధరతో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని జెడ్పీటీసీ విశాలాక్షి కొనుగోలు చేశారు.  
రామదాసుపేట గ్రామ సమీపంలో ఎకరా రూ.2లక్షల చొప్పున 27 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు.  మార్కెట్‌ ధర ప్రకారం ఈ ప్రాతంలో ఎకరా రూ. 10 లక్షలకు పైగా అమ్ముడు పోతోంది. కొనుగోలు చేసిన విస్తీర్ణం కంటే ఎక్కవగా కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు.  
ముంటిమడుగు వద్ద పెన్నానది సమీపంలో రిజిస్టర్‌ భూమిని టీడీపీ నాయకులు కొనుగోలు చేసి, పెన్నానదిలో పెద్ద బోరు వేసి అక్కడ నుంచి పైపు లైన్‌ ద్వారా సప్తగిరి కర్పూరం ఫ్యాక్టరీకి నీటిని అమ్ముకుంటున్నారు. 
మండలంలో జియో కేబుల్‌ వర్క్‌ పనుల్లో రూ.5లక్షలు ముడుపులు దండుకున్నారు.  
గార్లదిన్నెకు చెందిన టీడీపీ నాయకుడు జంబులదిన్నె చెరువులో మట్టి, తుమ్మ చెట్లు అమ్ముకొని రూ. లక్షలు వెనకేసుకున్నాడు.  

ఇసుక రీచ్‌లో రూ. 3 కోట్లు
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2014 డిసెంబ రు 18న ఉల్లికల్లు ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. వె లుగు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఇసుక రీచ్‌ నుంచి 32 వేల క్యూబిక్‌ మీటర్ల వరకూ ఇసుక తరలింపున కు అనుమతులు ఉన్నాయి. అయితే నిబంధనలు తుంగలో తొక్కి 47 క్యూబిక్‌ మీటర్ల వరకూ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. రికార్డుల్లో మాత్రం 27 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే చూపించారు. అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణ చేపట్టి 16 మంది వెలుగు సిబ్బందిపై అధికారులు వేటు వేశారు.  తిరిగి 2015 డిసెంబర్‌ నెలాఖరులో మరోసారి 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక తరలింపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ రెండు విడతల్లోనూ ఉచితం పేరుతో ఇసుక తర లిస్తూ.. అందిన కాడికి టీడీపీ నేతలు దోచేశారు. ఈ అక్రమాలన్నీ ఎమ్మెల్యే యామనీబాల సోదరుడు అశోక్, పీఏ కిరణ్‌ కనుసన్నల్లోనే జరిగాయి. రోజుకు 30 టిప్పర్లు చొప్పున ప్రతి టిప్పర్‌కు రూ. 2వేలకు పైగా అదనంగా డబ్బు వసూలు చేశారు. రోజుకు రూ. 60వేలకు పైగా దోచుకున్నారు. నెలకు రూ.18 లక్షలు వరకు కూడబెట్టుకున్నారు. ఈ సమయంలోనే అక్రమాలపై పత్రికల్లో కథనాలు వెలువడడంతో ఇసుకరీచ్‌ను నిలిపి వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అ య్యాయి. అయినా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కు అంటూ అనుమతులు లేకున్నా ఇసుకను తరలి స్తూ వచ్చారు. ఈ లెక్కన దాదాపు రూ. 3 కోట్ల వర కూ ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిపోయింది.  

నార్పల మండలంలో...
నార్పలలోని కూతలేరు వంకలో రూ. 48 లక్షల ఉపాధి హామీ నిధులతో మట్టి తీసే పనిని స్థానిక టీడీపీ నేత ఆలం రమణ చేశారు. అయితే పనులు పూర్తి స్థాయిలో చేయలేదు. ఈ పనిలో ఎమ్మెల్యేకు రూ. 5 లక్షలు, మరో టీడీపీ నేతకు రూ. 2 లక్షలు చొప్పున కమీషన్లు ముట్టజెప్పినట్లు సమాచారం.  
రూ. 8 కోట్లతో నాయనపల్లి క్రాస్‌ నుంచి ఏకనాదంపల్లి వరకు, రూ. 12 కోట్లతో ముచ్చుకుంటపల్లి, గూగూడుకు చేసిన తారు రోడ్డు పనుల్లో ఐదు శాతం కమీషన్‌ను ఎమ్మెల్యే తీసుకున్నారు.  
గూగూడు చెరువులో నీరు–చెట్టు కింద రూ.2 కోట్లతో పూడిక తీత పనులను టీడీపీ నాయకులు చేశారు. పనులు అరకొరగా చేసి పూర్తి స్థాయిలో బిల్లులు చేసుకున్నారు.   

యల్లనూరు మండలంలో..
యల్లనూరు మండలంలో 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు రూ.8.84 కోట్ల మేరకు 156 పనులను టీడీపీ నేతలు నీరు–చెట్టు కార్యక్రమం కింద చేశారు. 57 చెక్‌డ్యాంలు, మరో 99 పూడిక తీత పనులు చేశారు. ఈ పనులన్నీ నాసిరకంగా పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని స్వాహా చేశారు.   
కోడుముర్తి గ్రామ సమీపంలోని ఇసుక రీచ్‌ను  టీడీపీ మండల నాయకులు చేజిక్కించుకుని దోపిడీకి తెరలేపారు. అనుమతులు ఉన్న ప్రాంతం నుంచి కాకుండా చిత్రావతి నది నుంచి ఇసుకను భారీ యంత్రాలను ఏర్పాటు చేసి తరలించి సొమ్ము చేసుకున్నారు. రోజూ 700 క్యూబిక్‌ మీటర్ల చొప్పున నాలుగు నెలల పాటు తరలించారు. ఇసుక దందాలో లెక్కకు మించి ఆదాయాన్ని గడించినట్లు టీడీపీ నాయకులే పేర్కొంటున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top