ప్రధానిగా ప్రణబ్.. లేదు మా నాన్న మళ్లీ రారు!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ ప్రకటించే అవకాశముందని శివసేన చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మళ్లీ రాజకీయాల్లో వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు.
ప్రణబ్ ముఖర్జీ అనూహ్యంగా ఆరెస్సెస్ సదస్సులో పాల్గొని.. జాతీయవాదం, దేశభక్తి, జాతి గురించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోతే.. ప్రణబ్ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఆరెస్సెస్ రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో కంటే 110 సీట్లు తక్కువ వచ్చే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ట.. ‘మిస్టర్ రౌత్.. రాష్ట్రపతిగా రిటైరైన తర్వాత మా నాన్న రాజకీయాల్లోకి మళ్లి వచ్చే అవకాశమే లేదు’ అని ట్వీట్ చేశారు.