
అభ్యర్థుల ఎంపిక వ్యవహారం టీడీపీకి కంటిమీదకు కునుకు లేకుండా చేస్తోంది. ఒక నియోజకవర్గ సమస్య పరిష్కారం అయిందనుకుంటే మరో నియోజకవర్గంలో సమస్య ఉత్పన్నమవుతోంది.రాయచోటి వ్యవహారం జఠిలం కాగా అదేబాటలో కమలాపురం టికెట్ వ్యవహారం నడుస్తోంది. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలసుబ్రమణ్యం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించడంతో టీడీపీ పంటి కింద రాయిపడ్డట్లయింది. తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కంట్లో నలుసు కానున్నారు. పునరాలోచన చేయకపోతే పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి కడప : ఈమారు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రకటించారు. ఇదివరకే తన అనుచరులను సమాయత్తం చేశారు. ఆమేరకు దండోపాయం పన్నుతూ ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఆపై అభ్యర్థిత్వం రేసులో ముందువరుసలో నిలిచారు. టీడీపీ సర్వేలకు ప్రాధాన్యత ఇస్తుందని, కేడర్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని ఇంతకాలం వీరశివా వర్గం ఆశిస్తూ వచ్చింది. ఆపై రాజ్యసభ సభ్యుడు రమేష్నాయుడు మద్దతు ఉండడంతో టికెట్పై ఆశలు పెరిగాయి. ఈనేపథ్యంలో టీడీపీ ఇన్చార్జి పుత్తానరసింహారెడ్డి రెండురోజులు విజయవాడలో తిష్టవేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచి అనుకూలనిర్ణయం ప్రకటించుకున్నారు. అప్పటి వరకూ టికెట్ తనదేనని ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఒక్కమారుగా ఉలికిపాటుకు గురయ్యారని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పటికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చిన వీరశివా హఠాత్పరిణామం నేపథ్యంలో సీఎంను కలిశారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఓమారు సర్వే చేసి ఫైనల్ చేయాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఆమేరకు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కేడర్ అభిప్రాయాన్ని కోరారు. అందులో టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి కంటే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి అనుకూలంగా వచ్చినట్లు తెలు స్తోంది. అయినా పునరాలోచన లేకపోవడంతో ఆయన వర్గీయులు టీడీపీ అధిష్టానంపై మండిపడుతున్నారు.
అమీతుమీకి సిద్ధమైన వీరశివా వర్గీయులు..
రాయచోటి టికెట్ ప్రసాద్బాబు ఇవ్వాలి.. లేదంటే ముస్లిం మైనార్టీలకు కేటాయించాలని.. అలా కాకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డికి కేటాయిస్తే తాము టీడీపీకి పనిచేయమని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. వారి వాదనను కనీస పరిగణలోకి తీసుకోకుండా రమేష్రెడ్డి ఎంపిక చేయడంతో అక్కడి కేడర్ ఒత్తిడి మేరకు స్వతంత్ర అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీచేసేందుకు సమాయత్తమయ్యారు. తాజాగా అదే పరిస్థితి కమలాపురం నియోజకవర్గంలో తలెత్తింది. సర్వేల్లో ముందువరుసలో ఉన్న వీరశివాకు ఇదివరకే గ్రీన్సిగ్నల్ ఇచ్చి గడువు సమీపించడంతో ప్లేట్ ఫిరాయించడంపై అధిష్టానంతో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. పోటీలో మెరుగైన అభ్యర్థికి కాకుండా కేడర్కు ఇష్టం లేని వారిని ఎలా నిర్ణయిస్తారని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. అధిష్టానం నుంచి ఆశించిన సానుకూలత లభించకపోతే ఆపార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజీనామా చేసి, తర్వాత తన వర్గీయుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలనే దిశగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వీడడమా....ప్రత్యామ్నాయ పార్టీల్లో చేరడమా...లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటమా... చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా టికెట్ విషయమై అల్టిమేటం జారీ చేసి సిఎం ద్వారా ఏదో ఒక హామీ తీసుకోవాలనే ఎత్తుగడలు వేస్తున్నట్లు ఆయన వైరిపక్షం వర్గీయులు ఆరోపిస్తున్నారు. పైగా కమలాపుం టికెట్ మనదే, పందేలు కాయండీ అంటూ ప్రోత్సహించి అనుచరులను దివాళా తీయించారనీ, వారి ఒత్తిడి గట్టేక్కేందుకు వ్యూహాత్మంగా వ్యవహారిస్తున్నారనీ, టీడీపీ వదలి వెళ్లే ప్రసక్తే లేదని మరికొందరు వాదిస్తున్నారు. సోమవారం సీఎంతో వీరశివా భేటీ తర్వాత అసలు విషయం తెరపైకి రానుంది.