సీఎంది కోడి మెడ.. ఒక్క బ్లేడు సరిపోతుంది

Nizamabad BJP MP Aravind Fires On KCR Over TSRTC Strike - Sakshi

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి, నిజామాబాద్‌ : ఆర్టీసీ భూములు అమ్ముకోడానికి సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌ ఆరోపించారు. సోమవారం నిజామాబాద్‌ ఆర్టీసీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మెపై ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు మెదపడం లేదని, మంత్రి హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ హోల్‌సేల్‌గా, ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ సమ్మె భయంతోనే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ తన కుటుంబంపై చూపించే ప్రేమలో 5 శాతం ఆర్టీసీ మీద చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు సీఎం కేసీఆర్‌ ఆహంకార ప్రకటనలే కారణమని, ఇందులో కేంద్రం తప్పు ఏముందని ప్రశ్నించారు. 

అలాగే  ‘దళితుడిని సీఎం చేయకుంటే మెడ కోసుకుంటాను అన్న కేసీఆర్‌కు బ్లేడు పంపిద్దామా.. సీఎంది కోడి మెడ.. ఒక్క బ్లేడు సరిపోతుంది’ అంటూ చురకలు అంటించారు. సీఎం కేసీఆర్‌ను కోర్టుకు ఈడ్చాలని, ఆయన చర్యలను కేంద్రం గమనిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ తప్పులు 100 అవ్వగానే ఆయన మెడ తెగడం ఖాయమని, కేసీఆర్‌ జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లో ఉన్నాయని అభిప్రాయం వ‍్యక్తం చేశారు. విపరీత పాపాలు చేసిన కేసీఆర్‌ను గద్దె దింపాలని ఎంపీ అర్వింద్‌ పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని, విజయం సాధించే రోజు దూరంలో లేదని భరోసాయిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top