‘తప్పు’లో కాలేసిన నరేంద్ర మోదీ | Narendra Modi Once Again Mistaken At Karnataka Assembly Election Campaign | Sakshi
Sakshi News home page

‘తప్పు’లో కాలేసిన నరేంద్ర మోదీ

May 4 2018 4:07 PM | Updated on Sep 5 2018 1:55 PM

Narendra Modi Once Again Mistaken At Karnataka Assembly Election Campaign - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూను విమర్శించడమన్నా, భారత సైన్యాన్ని పొగడడమన్నా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టం. ఇక ఈ రెండు విషయాలను కలిపి మాట్లాడటమంటే మరీ మరీ ఇష్టం. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో గురువారం నాడు ఆయన తన ఈ ఇష్టాన్ని ప్రదర్శించబోయి అనుకోని కష్టాలు తెచ్చుకున్నారు. కర్ణాటక అంటేనే ధైర్య సాహసాలకు మారుపేరని, అలాంటి కర్ణాటక గడ్డపై పుట్టి, 1948లో పాకిస్థాన్‌ను ఓడించిన యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డ్‌ మార్షల్‌ కరియప్ప, భారత సైనిక కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ తిమ్మయ్యలను ప్రధాన మంత్రి నెహ్రూ అవమానించారని, అప్పటి రక్షణ మంత్రి కృష్ణన్‌ మీనన్‌ను కూడా నెహ్రూ విమర్శించారని మోదీ పేర్కొన్నారు. 

కరియప్ప, తిమ్మయ్యలను కర్ణాటక బిడ్డలనడంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ 1948లో జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య భారత సైనిక కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా లేరు. అప్పటి బ్రిటీష్‌ సైనికాధికారి రాయ్‌ బుచర్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఏడాదికి అంటే, 1949లో భారత సైన్యం కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ పదవిని అప్పగించారు. అదీ నరేంద్ర మోదీ చెప్పినట్లుగా జనరల్‌ తిమ్మయ్యకు కాదు, కేఎం కరియప్పకు అప్పగించారు. కరియప్పతో నెహ్రూ ఘర్షణ పడ్డమాట వాస్తవమే! అది మోదీ చెప్పినట్లు 1948లో కాదు, 1951లో. రాజకీయ అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు కరియప్పపై మండిపడిన నెహ్రూ ఆయన్ని ఆస్ట్రేలియాకు హై కమిషనర్‌గా పంపించారు. అలాగే నరేంద్ర మోదీ చెప్పినట్లుగా 1948లో భారత రక్షణ మంత్రిగా కృష్ణ మీనన్‌ లేరు. అప్పుడు తొలి భారత రక్షణ మంత్రిగా బల్దేవ్‌ సింగ్‌ ఉన్నారు. 1952 వరకు ఆయన అదే పదవిలో కొనసాగారు. 

ఇంతకు తిమ్మయ్య ఎవరు?
కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లాలో జన్నించిన జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య 1957 నుంచి 1961 వరకు భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 1957, డిసెంబర్‌ నెలలోనే కృష్ణన్‌ మీనన్‌ కూడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తిమ్మయ్య, మీనన్లతోని నెహ్రూ గొడవ పడ్డారని మోదీ చెప్పడం కొంత మేరకే నిజం. వాస్తవానికి వీరు ముగ్గురు పరస్పరం విభేదించారు. అది కూడా మోదీ అనుకున్నట్లు 1948లో పాక్‌తో యుద్ధం ముగిశాక కాదు. 1959లో. సైన్యంపై పౌర అధికార యంత్రాంగం ఉండరాదన్నది మొదటి నుంచి జనరల్‌ తిమ్మయ్య వాదన. అంటే రక్షణ మంత్రి కూడా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నది ఆయన ఉద్దేశం. దీన్ని కృష్ణన్‌ మీనన్‌ వ్యతిరేకించారు. మరో పక్క అమెరికా లాబీకి లొంగరాదంటూ కృష్ణన్‌ మీనన్‌ నెహ్రూపై ఒత్తిడి చేశారు. ఆ సమయంలో చైనాతో భారత్‌కు సరిహద్దు గొడవ నడుస్తోంది. 

అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ భారత్, పాక్‌ దేశాల మధ్య సంయుక్త రక్షణ ఒప్పందం గురించి ప్రతిపాదన తీసుకొచ్చారు. దీన్ని ఆమోదించాలంటూ జనరల్‌ తిమ్మయ్య వాదించారు. దీన్ని మీనన్, నెహ్రూలు విభేదించడంతో తిమ్మయ్య రాజీనామా చేస్తానంటూ నెహ్రూకు ఓ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన 1961లో తన పదవికి రాజీనామా చేశారు. చైనాతో సరిహద్దు సంక్షోభం ఉన్న సమయంలో పదవి నుంచి తప్పుకోవడం ఏమిటంటూ ఈ విషయాన్ని నెహ్రూ పార్లమెంట్‌లో ప్రస్థావించారు. ఈ ముగ్గురు మధ్య తలెత్తిన వివాదాల కారణంగానే 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్‌ ఓడిపోయిందన్నది చరిత్రకారుల విశ్లేషణ.

మోదీ చారిత్రక అంశాలను ప్రస్తావించినప్పుడల్లా అందులో తప్పులే ఉంటున్నాయి. ఆవేశంగా మాట్లాడడంలో ఆయన అసలు విషయాలు మరచిపోతారా? ఎప్పుడో చదువుకున్న చారిత్రక అంశాలు మరచిపోయి ఉంటారా? స్క్రిప్టు రైటర్లు ఇచ్చే కాగితాలను ఆదరాబాదరాగా చదువుకోవడం వల్ల ఇలా జరుగుతుందా? ఆయనకే తెలియాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement