సగర సంఘం అధ్యక్షుడిగా నర్సింహ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సగర(ఉప్పర) సంఘం అధ్యక్షుడిగా బంగారు నర్సింహ సగర, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి శేఖర్ సగర ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ భవన్లో సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘం కోశాధికారిగా వరంగల్కు చెందిన కె.సదానందం సగరలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నర్సింహ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉంటూ సగర ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఈఎండీలు లేకుండా టెండర్లలో పాల్గొనే వీలుగా జీవో 29ను సాధించామన్నారు. సగర జాతి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో సగర ఫెడరేషన్కు రూ.6.30 కోట్లు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించామన్నారు. సగరల బతుకులు మారాలంటే బీసీ ‘డీ’నుంచి ‘ఏ’లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రధానకార్యదర్శి శేఖర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ రాష్ట్ర కమిటీ సలహాదారులు, మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సగరులను బీసీ–ఏలో చేర్చండి
సాక్షి, హైదరాబాద్: సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని, సగర ఫెడరేషన్లకు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించాలని సగర సంఘం డిమాండ్ చేసింది. సగర సంఘం నూతన అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సాగర్ నేతృ త్వంలోని కమిటీ సభ్యులు సోమవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి సగరుల సమస్యలపై వినతిపత్రం అందచేశారు. భగీరథుని విగ్రహం ట్యాంక్బండ్పై నెలకొల్పాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సగరల డిమాండ్లను పరిష్కరిస్తామని కడియం హామీ ఇచ్చారు.