జిల్లాకు ఎందుకొచ్చావు బాబూ? 

MLC Rama Krishna Reddy Fires On Chandrababu Over Kurnool Visit - Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్సీ చల్లా ఫైర్‌

సాక్షి, కోవెలకుంట్ల(కర్నూల్‌) :  జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి, శ్రీశైలం జలాశయం నిండి..గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులంతా సంతోషంగా ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో వారితో ఫొటోలు దిగేందుకు వచ్చావా అంటూ టీడీపీ అధినేత చంద్ర బాబుపై ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం  ఆయన  చల్లా భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘ నీ హయాంలో రాయలసీమ జిల్లాల్లో కరువు కాటకాలతో అల్లాడిపోయిన దినసరి కూలీలు, రైతు సోదరులు వలసలు వెళితే.. రెయిన్‌గన్లతో మాయాజాలం చేశావు. కరెంట్‌ సరిగా ఇవ్వకపోవడంతో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అర్ధరాత్రి చీకట్లో వెళ్లి కరెంట్‌ షాక్‌కు, పాముకాటుకు బలై పోలేదా? అప్పటి కాలానికి విరుద్ధంగా నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలిస్తే వర్షాలు కురుస్తున్నాయి. పట్టపగలే 9 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నారు. దీన్ని చూసి పోదామని వచ్చావా బాబూ? నీ పాలనలో ఆశావర్కర్లకు రోజుకు వంద రూపాయల ప్రకారం మాత్రమే ఇచ్చి దినసరి కూలీలకంటే హీనంగా చూశావు. అలాంటి వారి వేతనాన్ని వైఎస్‌ జగన్‌ రూ.10 వేలకు పెంచి ఆదుకున్నారు. దేశచరిత్రలోనే అతి తక్కువ కాలంలో 4.30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారి జీవితాలను నిలబెట్టారు. వారిని పలకరించేందుకు ఏమైనా వచ్చావా బాబూ?  మీ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేశారు.

ఇప్పుడు పూర్వ వైభవం తెచ్చి దాదాపు రెండువేల జబ్బులకు అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగున ఉన్న హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లోనూ చికిత్స చేయించుకునేందుకు వీలు కలి్పంచారు. ఆ పథకం గురించి తెలుసుకునేందుకు ఏమైనా వచ్చావా బాబూ? నీ కాలంలో ఒకరికి పింఛన్‌ కావాలంటే మరొకరు చావాల్సిన పరిస్థితి ఉండేది. మద్యం షాపులకు పోటీలు పెంచి ఆంధ్రా ప్రజానీకంలో సగభాగాన్ని తాగుబోతులను చేశావు. ఎందరో తల్లుల నల్లపూసల దండలు తెగి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే..నేడు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాబోయే తరాలు కూడా హర్షించేలా దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు శ్రీకారం చుట్టారు. నిరుపేద పిల్లలు సైతం బడులకు వెళ్లి చక్కగా చదువుకునేందుకు త్వరలో అమ్మఒడి పథకాన్ని అమలు చేయనున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకే కాకుండా దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరు నెలల కాలంలోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నార’ని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలను పదిసార్లు చదువుకుని, కర్నూలు జిల్లాలో  మీరెక్కిన వేదిక నుంచి ఏ ఒక్క పథకాన్ని కూడా మిస్‌ కాకుండా అన్నింటిని చూడకుండా చెప్పగలిగితే నేను రాజకీయాల నుంచి నిష‍్క్ర మిస్తానని, ఇందుకు  సిద్ధమా అంటూ చంద్రబాబుకు చల్లా సవాల్‌ విసిరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top