స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !

Minister Anil Kumar Slams Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుకు మంత్రి అనిల్‌ కుమార్‌  సవాల్‌

సాక్షి, మాచర్ల: ‘దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు.. 29 గ్రామాలకు పరిమితమైన నువ్వా మమ్మల్ని రౌడీలని మాట్లాడేది.. మాకు నిజాయితీ ఉంది కాబట్టి నోరు ఉంది.. నీలాగా గుంట నక్క జిత్తులు మాకు తెలియవు.. ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడటమే తెలుసు..త్వరలో జరగబోయే లోకల్‌ ఎన్నికలకు అసలు అభ్యర్థులున్నారో వెతుక్కో మాజీ సీఎం చంద్రబాబు’ అంటూ జలవనరుల శాఖ రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గ మార్కెట్‌ యార్డు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేలాది మందిని ఉద్దేశించి ఉద్రేకపూరితంగా మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కోర్టులకు తన అనుచరులను పంపించి కేసులు వాయిదా వేయించే ప్రయత్నం ఎందుకని ప్రశ్నించారు.


ఓటమి భయంతోనే కేసుల పేరుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకొని మాట్లాడాలని, నాలుగు అనుకూల మీడియా డబ్బాలను పెట్టుకొని రాజకీయాలు చేయటం మంచిది కాదని హితవు పలికారు.  వెనుకబడిన పల్నాటి ప్రాంతానికి ఒక దశలోనే వరికపూడిసెలను రూ. 1630 కోట్లతో సీఎం వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీకు మార్కెట్‌ యార్డులు, ఇతర పదవులలో 50% ఇచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గం మొత్తం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని, రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు.

స్థానిక ఎన్నికలు పూర్తయిన అనంతరం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వరికపూడిసెలకు శంకుస్థాపన  చేస్తామని పేర్కొన్నారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాçష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, గుంటూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్లు కామనబోయిన కోటయ్య, బత్తుల ఏడుకొండలు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు  యరబోతుల శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసశర్మ, కుర్రి సాయి మార్కొండారెడ్డి, పల్లపాటి గురుబ్రహ్మం పాల్గొన్నారు. 

మార్కెట్‌ యార్డు కార్యవర్గం ప్రమాణం  
నూతనంగా నియమించబడిన మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పల్లపాటి నారాయణమ్మ, వైస్‌ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఐనబోయిన శ్రీను, దుబ్బా సీమోను, బొనిగే సాగరమ్మ, జల్లా శాయమ్మ, కొత్త శ్రీనివాసరావు, దుర్గెంపూడి శివమ్మ, గుంజనబోయిన లింగమ్మ, మట్టపల్లి బ్రహ్మం, ఆరికట్ల మంగమ్మ, జవిశెట్టి అనసూర్య, గోగిరెడ్డి కేశవరెడ్డి, మాచర్ల పుల్లమ్మ, రెంటాల పున్నయ్యలతో మంత్రి అనిల్‌కుమార్, ఎమ్మెల్యే పీఆర్కే, మార్కెట్‌ యార్డు శాఖాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top