ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి : భట్టి
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి మల్లు విక్రమార్క మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇక్కడ గన్పార్క్ వద్ద నిర్వహించిన ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన ప్రదర్శనకు భట్టి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. అంతేగాక ప్రస్తుతం బలమైన కూటమిగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్కు తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గన్పార్క్ వద్ద నిర్వహించిన సేవ్ డెమోక్రసీ నిరసన కార్యక్రమానికి భట్టి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు.