ఏం పాపం చేసిందని హైదరాబాద్ను పట్టించుకోలేదు?
ఎంపీలందరూ రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి
కేసీఆర్ను సిట్ విచారించడం అధికారికంగా, చట్టబద్ధంగానే జరుగుతోంది : డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్రానికి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అన్ని రంగాల్లో అనుకూలతలు కలిగి ఉన్న హైదరాబాద్ ఏం పాపం చేసిందని పట్టించుకోలేదని నిలదీశారు. ఆదివారం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఉంటాయని ఆశించాం..కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తమను నిరాశ పర్చిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను, సీఎం రేవంత్, సహచర మంత్రులు, ఎంపీలు పలు దఫాల్లో బృందాలుగా వెళ్లి దేశ ప్రధాని, ఆర్థిక మంత్రిని కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ ప్రపంచానికి ఫార్మా రాజధాని వంటిది. కోవిడ్ సమయంలో ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ప్రశంసించిన భారత్ బయోటెక్ ఈ మట్టిలోనే ఉంది. కానీ బయో ఫార్మా కేటాయింపుల్లో తెలంగాణ పేరు లేకపోవడం విడ్డూరం. ఎల్రక్టానిక్స్ రంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించి, ఈసీఐఎల్ వంటి దిగ్గజ సంస్థలున్న హైదరాబాద్కు ఒక్క పైసా ఇవ్వకపోవడం నిరాశ పరిచింది. హైదరాబాద్ అంటే ఎల్రక్టానిక్స్.
ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అన్న నానుడిని కేంద్రం చెరిపివేసే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ తరాలకు అత్యంత కీలకమైన ఆరెంజ్ ఎకానమీ (ఆడియో, వీడియో, గేమింగ్, కామిక్స్) రంగంలో హైదరాబాద్ ప్రపంచస్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా ముంబైకి మళ్లించింది. మెడికల్ టూరిజంలో దేశానికే తలమానికంగా ఉన్న తెలంగాణను విస్మరించి, ఇతర రాష్ట్రాలకు రీజినల్ మెడికల్ వ్యాల్యూ హబ్లు ఇవ్వడం ఏ చట్టం కిందకు వస్తుంది. ఇలా అన్ని రంగాల్లో హైదరాబాద్ను పట్టించుకోకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టారు’అని వ్యాఖ్యానించారు.
భారీ నిధులు వస్తాయని ఆశించాం
హైదరాబాద్ నగరాభివృద్ధికి కీలకమైన మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్ , మెట్రో రైలు విస్తరణ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు ఆశించాం..కానీ ఒక్క ప్రాజెక్టుకు కూడా కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని భట్టి అన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమ కోసం సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమలు, ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రధానిని కలిసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. రామప్ప దేవాలయం, మన్ననూరు, కవ్వాల్ టైగర్ రిజర్వ్లు, చారిత్రక ఆలయాలతో టూరిజం కేంద్రంగా ఉన్న తెలంగాణకు టూరిజం ప్యాకేజీలో కేంద్రం స్థానం కల్పించకపోవడం అన్యాయమన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్విర్యం చేయడం ద్వారా గ్రామీణ పేదల బతుకుతెరువును దెబ్బతీస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమంపై బడ్జెట్ మౌనాన్ని వహించడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు. కేంద్రానికి ఒక నీతి, రాష్ట్రానికి ఒక నీతా అని భట్టి ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్టీలు, రాజకీయాలకతీతంగా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
దేశ రక్షణ కోసం చేయాల్సింది
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ విచారించడంపై భట్టి స్పందించారు. కేసీఆర్పై తమకు కక్ష సాధింపు అవసరం లేదని, విచారణ అధికారికంగా, చట్టబద్ధంగా జరుగుతోందని చెప్పారు. పారదర్శక పాలన అందించడమే తమ ఆలోచన అని, ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. అయినా, దేశరక్షణ, ఉగ్రవాద నియంత్రణ కోసం ఉపయోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ను వ్యక్తులపై, వారి వ్యక్తిగత జీవితాలపై చేస్తే ఎలా అని ప్రశ్నించారు. విచారణ ఎవరి ఇష్ట ప్రకారం జరగదని, అలా జరిగితే కక్ష అవుతుందని, విచారణ విచారణగానే జరుగుతుందని భట్టి వ్యాఖ్యానించారు.


