
అధికార టీడీపీలో రేగిన అసంతృప్తి
సాక్షి, గుంటూరు: అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్లక్ష వైఖరికి నిరసనగా రేపటి (శనివారం) నుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు.
ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి వాపోయారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జిను నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓటమిని చవి చూసింది.. ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరారు.