
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయో ఎవరికీ తెలియదని బీజేపీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక సంప్రదాయాలు, శాసనసభ వ్యవహారాల సలహా సంఘం అంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని విమర్శించారు.
ఒక్కసభా నాయకునికి మాత్రమే సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలిసినట్టుందన్నారు. ముఖ్యమైన అంశాలను చర్చించకుండా అధికారపార్టీ సభ్యులు సభను ఏకపక్షంగా నడిపించుకుంటున్నారని అన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.