పాక్షిక మేనిఫెస్టో అంతా గ్రాఫిక్సే | Kishan Reddy Fires On KCR Over TRS Partial Manifesto | Sakshi
Sakshi News home page

Oct 18 2018 2:31 AM | Updated on Oct 18 2018 4:56 AM

Kishan Reddy Fires On KCR Over TRS Partial Manifesto - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాక్షిక మేనిఫెస్టో, పూర్తి మేనిఫెస్టో అంటూ సీఎం కేసీఆర్‌ నాటకాలాడుతున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలన్ని గ్రాఫిక్స్‌ మాయాజాలమేనని.. ఆ పార్టీ దృష్టి అంతా అధికారంపైనే ఉందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ఇచ్చి న హామీలకే దిక్కులేదని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచి వేల మంది మరణానికి కారణమవుతున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి హైవేలపై ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తోందన్నారు.
 
ఒక్క పైసా ఇవ్వలేదు 
రక్షిత తాగునీటి మోటారు పంపులకు కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని కిషన్‌రెడ్డి విమర్శిం చారు. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క ప్రొఫెసర్‌ పోస్టయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు.  రైతుల రుణమాఫీలో అవకతవకలు జరిగాయని సీఎం కేసీఆరే ఒప్పుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే అనేక గ్రామాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ప్రజలు బీజేపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ హామీలు చిత్తశుద్ధితో కూడుకున్నవి కావని కిషన్‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తాయో ముందే చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ విశ్వనీయత కోల్పోయిందన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement