బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసిన కేశినేని నాని!
సాక్షి, విజయవాడ: గత కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేశారు. ఇప్పటికే పలువురు పార్టీ నేతలను టార్గెట్ చేసిన ఆయన తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు...నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నారు....దౌర్బాగ్యం’ అంటూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.
కాగా కొద్దిరోజుల నుంచి బుద్ధా వెంకన్న ట్వీటర్లో యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కొత్తగా ట్వీట్స్ పెడుతున్న నేపథ్యంలో కేశినేని నాని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలారోజుల నుంచి బుద్ధా వెంకన్నకు, కేశినేని నాని మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల టీడీపీలో షో మ్యాన్లు అవసరం లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజా ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతోంది.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తాను సూచించినవారికి ఇవ్వకుండా జలీల్ ఖాన్ కుమార్తెకు కేటాయించడం... దీని వెనుక మాజీమంత్రి దేవినేని ఉమతో పాటు బుద్ధా వెంకన్న కూడా ఉండటం కూడా నాని అసంతృప్తికి కారణం అని తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ఇద్దరు నేతల మధ్య వార్ కొనసాగుతోంది. గతంలోనూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన పార్టీ ఎంపీలను ఉద్దేశించి కేశినేని నాని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
సంబంధిత వార్తలు