‘మాస్టర్‌ప్లాన్‌ బీరువాలో దాచావా బాబూ’

Kanna Laxminarayana Fires On Chandrababu Naidu Over Amaravati Construction - Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. రాజధాని​ నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులతో ఒక్క పనికి కూడా శంకుస్థాపన చేయలేదని అన్నారు. ఇప్పటివరకు అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు. మాస్టర్‌ ప్లాన్‌ బీరువాలో దాచారా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం బాండ్ల జారీ ద్వారా సేకరించిన రెండువేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత 72వ స్వాతంత్ర్య దినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన బాబు ముమ్మాటికీ ఆంధ్రా ద్రోహి, పచ్చి అవకాశవాది అని తీవ్ర విమర్శలు చేశారు. రెండుకళ్ల సిద్ధాంతంలో రాటుదేలిన బాబు చివరకి పొత్తుల్లో  కూడా అదే ఫాలో అయ్యారని ఎద్దేవా చేశారు. గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి కారణం ప్రధాని నరేంద్రమోదీ చలవేనని అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తొలి విడతగా 10 కోట్ల మందికి ఉచిత ఆరోగ్య సేవలు అందనున్నాయి. సెప్టెంబర్‌ 25 నుంచి పథకం అమలవుతుందని ప్రధాని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top