‘కేసీఆర్‌ 18 గంటలు ఫామ్‌ హౌజ్‌లోనే’

K Laxman Comments On TRS And CONGRESS - Sakshi

దేశం కోసం మోదీ శ్రమిస్తున్నారు : లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : దేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ రోజూ 18 గంటలు పనిచేస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18 గంటలూ ఫామ్‌ హౌజ్‌లో ఉంటారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వాఖ్యానించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎక్కడుంటారో ఎవరికీ తెలియదని చురకలంటించారు. మజ్లిస్‌ పార్టీకి చేరువయ్యేందుకు కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుందనీ, అందుకనే నేరుగా టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయకుండా బీజేపీపై పసలేని వ్యాఖ్యలు చేస్తోందని ఎద్దేవా చేశారు.

మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే మజ్లిస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. కాంగ్రెస్‌ కూటమి, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం మజ్లిస్‌ కార్యాలయం దారుస్సలేంలో జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించినా.. వారు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయిస్తారని జోస్యం చెప్పారు.

మైనారిటీల కోసం పనిచేస్తున్నాం..
ముస్లిం పేదల కోసం బీజేపీ వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని లక్ష్మణ్‌ అన్నారు. ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో వారి ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా బీజేపీ అడుగులేసిందని అన్నారు. అక్టోబర్‌ 10 న అమిత్‌ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top