
సాక్షి, కృష్ణా: రూరల్ లైవ్స్టాక్ యూనిట్లను వెటర్నరీ డిస్పెన్సరీలుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ గన్నవరంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వెటర్నరీ విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన గురువారం విద్యార్థుల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఎన్ని వినతులు చేసిన ప్రభుత్వం తమ సమస్యలను తీర్చడం లేదంటూ విద్యార్థులు ఈ సందర్భంగా వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆయనకు వినతి పత్రం అందజేశారు. 2016లో వైఎస్ జగన్ మద్దతు తెలపడంతోనే ప్రభుత్వం దిగివచ్చి 250 మందికి ఆర్ఎల్యూలకు వీడీగా పదోన్నతి ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.
రాష్ట్రంలో టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. 1217 ఉద్యోగాల్లో సగం వెంటనే భర్తీ చేస్తామని, మిగతావాటిని ఒక సంవత్సరంలో భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాగా రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ (ఆర్ఎల్యూ)లను వెటర్నరీ డిస్పెన్సరీలుగా (వీడీ) అప్గ్రేడ్ చేయాలని గత 22రోజులుగా విద్యార్థులు రిలే దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.