నాగబాబుకి ఓటు వేయకండి : శివాజీ రాజా

Dont vote for Nagababu, says sivaji raja - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబుపై నటుడు, ‘మా’  మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’  ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌లో శివాజీ రాజా ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘నేను ఇలా మాట్లాడటానికి సుమారు 15 రోజుల పాటు ఆలోచించాను. పవన్‌ కల్యాణ్‌ తన కష్టం ఏదో తాను పడుతున్నాడు. ఇండస్ట్రీలో అందరూ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేశారు. కానీ నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా ఫ్యామిలీలో నాగబాబు ఒక్కడే తేడా. ఆయన భీమవరం నాది, నర్సాపురం నాది అంటున్నాడు..ఎలా అవుతుంది?. భీమవరంలో మురికివాడలు లేకుండా చేస్తావా?. నర్సాపురాన్ని బాగు చేస్తావా? నువ్వు వంటగదిలో నుంచి హాల్‌లోకి రావడానికే అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు నర్సాపురం వెళ్లి సేవ చేస్తావా?’  అంటూ ప్రశ్నలు సంధించారు. అలాగే ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top