రాహుల్‌ను కలిసేందుకు హర్దిక్, మేవానీలకు ఆహ్వానం

Cong invites Hardik Patel, Jignesh Mevani to meet Rahul Gandhi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ వస్తున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలవాలంటూ పటేల్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీలను కాంగ్రెస్‌ ఆహ్వానించింది. సోమవారం అహ్మదాబాద్‌లో జరిగే నవ్‌సర్జన్‌ గుజరాత్‌ జనాదేశ్‌’ ర్యాలీలో రాహుల్‌ సమక్షంలో బీసీ నాయకుడు అల్పేశ్‌ ఠాకోర్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ను కలవాలని హార్దిక్, మేవానీల్ని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సోలంకి ఆహ్వానించారు. పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు.

కాగా, హార్ధిక్‌కు అత్యంత సన్నిహితులు, పీఏఏఎస్‌ కీలక నేతలు వరుణ్‌ పటేల్, రేష్మ పటేల్‌ బుధవారం బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ చీఫ్‌ అమిత్‌ , గుజరాత్‌ సీఎం రూపానీలతో భేటీ తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు వరుణ్, రేష్మ వెల్లడించారు. రేష్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏజెంట్‌లా హార్ధిక్‌ వ్యవహరిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా ఉద్యమాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లపై బీజేపీ సానుకూలంగా స్పందించిందని, కానీ కాంగ్రెస్‌ మాత్రం ఓటు బ్యాంకు కోసం పటేల్‌లను వాడుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top