నా కుమారుడిని ఆశీర్వదించండి

CM Siddaramaiah Campaign in Varuna - Sakshi

యతీంద్ర తరఫున వరుణలో ప్రచారం చేసిన సీఎం సిద్ధు

రాకేశ్‌ జీవించి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు

పెద్ద కుమారుడిని స్మరించుకుని సిద్ధు భావోద్వేగం

మైసూరు : తాను పోటీ చేస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో మూడుసార్లు ప్రచారం నిర్వహించిన సీఎం సిద్దరామయ్య మంగళవారం తన కుమారుడు డాక్టర్‌ యతీంద్ర పోటీ చేస్తున్న వరుణ నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ నుంచి యతీంద్ర పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి బీ.ఎస్‌.యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పోటీలోఉన్నారు. దీంతో ఎలాగైనా∙ఈ ఎన్నికల్లో తన కుమారుడిని గెలిపించడం కోసం ప్రచారంలో వేగం పెంచారు. ఈ ప్రచారంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ... రాజకీయంగా తనకు జన్మనిచ్చింది వరుణ నియోజకవర్గం అయితే పునర్‌ జన్మనిచ్చింది చాముండేశ్వరి నియోజకవర్గమని సీఎం సిద్దరామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. నంజనగూడు తాలూకాలోని కోణనూరు గ్రామం నుంచి ప్రారంభించి నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. వరుణ నియోజక వర్గం తనకు ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి స్థానం కల్పించిందని, వరుణ, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు అని అన్నారు. ఇక్కడి నుంచి తనను ఆశీర్వదించిన ప్రజలు ఈసారి తన కుమారుడిని ఆశీర్వదించాలన్నారు. 

రాకేష్‌ను గుర్తుకు చేసుకుని కన్నీళ్లు
ప్రచారంలో మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య తన పెద్ద కుమారుడు రాకేష్‌ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గాలకు వస్తే తన పెద్దకుమారుడు తనకు గుర్తుకువస్తాడని అన్నారు. అతడే బతికి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదని,  రాకేష్‌కున్న ప్రజలతో కలిసి తిరిగిన అనుభవం యతీంద్రకు లేదని అన్నారు. రాకేష్‌ ఉండి ఉంటే వరుణతోపాటు చాముండేశ్వరిలో సైతం తానే చూసుకుంటూ ప్రచారం చేసే వాడని కంటనీరు పెట్టుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top