గెలిపించిన సెంటిమెంటే టీఆర్‌ఎస్‌ను ఓడిస్తుంది | Cheruku Sudhakar And Yennam Srinivas Reddy Slams TRS Govt | Sakshi
Sakshi News home page

గెలిపించిన సెంటిమెంటే టీఆర్‌ఎస్‌ను ఓడిస్తుంది

Oct 4 2018 6:00 AM | Updated on Apr 7 2019 3:34 PM

Cheruku Sudhakar And Yennam Srinivas Reddy Slams TRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణ సెంటిమెంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తుందని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా మహాకూటమి కూర్పు ఉంటే ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు, సామాజిక వర్గాలకు సముచిత స్థానం ఉంటేనే మహాకూటమి లేదా ప్రజాకూటమి విజయం సాధిస్తుందన్నారు. మహాకూటమి కూర్పులో అపసవ్యత ఉందని, కూటమి సారథ్యంలో తెలంగాణ ఉద్యమ శిఖరాలు, ముఖాలు లేవన్నారు. టీడీపీ ఈ కూటమి కూర్పులో ప్రధానం కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీడీపీకి తెలంగాణలో బలం ఉంటే సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే, హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఎందుకు సీట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.    సమావేశంలో నరసింహగౌడ్, కుందూరి దేవేందర్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, పరిగి రామన్న మాదిగ పాల్గొన్నారు.

‘నోటా సినిమాను అడ్డుకోండి’
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ‘నోటా’ సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఓ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉస్మానియా జేఏసీ నేత పున్నా కైలాశ్‌ నేత ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ ప్రధాన పరిశీలనాధికారితో పాటు నోటా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నోటా, ఎన్‌టీఆర్‌ తదితర పేర్లతో సినిమాలు తీస్తున్నారన్నారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement