రైల్వే జోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు: విష్ణు

BJP MLA Vishnu Kumar Raju Slams Chandrababu Naidu In Visakapatnam - Sakshi

విశాఖపట్నం: రైల్వే జోన్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుళ్లు, కుతంత్రంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాచైతన్య సభలో విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ..బీజేపీపై బురదజల్లే కార్యక్రమం విశాఖ కేంద్రంగా టీడీపీ చేపట్టిందని ఆరోపించారు. రైల్వేజోన్‌తో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. టీడీపీకి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉందని అన్నారు.

ప్రజలు టీడీపీ నాయకులను అధికారం నుంచి బయటకు పంపే సమయం కోసం వేచిచూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు, అధికారులను మేనేజ్‌ చేసి నకిలీ పత్రాలు తయారు చేసి భూములు కాజేశారని  ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్‌ కమిటీ నివేదిక ఇంకా బయటపెట్టలేదని, ఆ నివేదిక బయటపెడితే పసుపు పచ్చ పాములు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు.

బాబుకు మోదీ జ్వరం: సోము
చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ జ్వరం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. మోదీని ఏపీకి రావద్దనే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌, మోదీ ఇద్దరూ కలిసి కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు డబ్బు జబ్బు పట్టుకుందని తీవ్రంగా విమర్శించారు. ఈ రాష్ట్రానికి రూ.50 వేల కోట్లు ఎన్‌ఆర్‌జీఎస్‌కు నిధులొస్తే, అందులో రూ.16 వేల కోట్లు మట్టి తవ్వి.. 30 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top