దళితుల వెనకబాటుకు కారణం కాంగ్రెస్సే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితుల వెనకబాటుకు కాంగ్రెస్ పాలనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించినా కాంగ్రెస్కు కనిపించటం లేదని, తాజాగా మీరాకుమార్ మాటలే దీనికి నిదర్శనమని చెప్పారు. సోమవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రపతులుగా దళితులైన మీరాకుమార్, సుశీల్కుమార్ షిండే, వెంకటస్వామిలాంటి వారికి అవకాశమివ్వకుండా, ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ఎంచుకోవటాన్ని ప్రజలు గమనించారన్నారు.
79 మంది దళిత ఎంపీలు, 543 మంది దళిత ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారన్నారు. 1980 ఎన్నికల్లో జగ్జీవన్రామ్ను ప్రధాని అభ్యర్థిగా చేయకుండా కాంగ్రెస్ కుట్రలు పన్ని ఓడించిందని పేర్కొన్నారు. జగ్జీవన్రామ్ కూతురైన మీరాకుమార్ కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రశ్నించడం మానేసి బీజేపీని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు.