
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో బీఎస్ యడ్యూరప్ప తనయుడు పోటీచేయడం లేదు. ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. యెడ్డీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్వహిస్తూ.. ఎన్నికల్లో పార్టీకి నేతృత్వం వహిస్తున్నప్పటికీ.. టికెట్ల విషయంలో ఆయనకు నిరాశే మిగిలింది. యెడ్డీ తనయుడు విజయేంద్రకు, ఆయన సన్నిహితురాలు శోభా కర్లందాజేకు బీజేపీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. దీంతో యెడ్డీ మద్దతుదారులు భగ్గుమన్నారు. అమిత్షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ హోటల్లో జరిగిన పార్టీ కార్యక్రమంలో వీరంగం సృష్టిస్తూ.. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయంలోగా వరుణ నియోజకవర్గం నుంచి విజయేంద్ర టికెట్ ప్రకటించాలని, లేకుంటే తాము మూకుమ్మడి రాజీనామా చేస్తామని విజయేంద్ర అనుచరులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇటు యెడ్డీ, అటు ఆయన తనయుడు అసమ్మతితో రగిలిపోతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దిగొచ్చింది. యెడ్డీ తనయుడిని బుజ్జగించేందుకు పదవిని ఆఫర్ చేసింది. బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయేంద్రను నియమిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, విజయేంద్ర అనుచరులు కోరినట్టు వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చింది. మొత్తానికి విజయేంద్ర వ్యవహారం బీజేపీ తీవ్ర అసమ్మతికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.