
పోలింగ్ కేంద్రం
సాక్షి, బెంగళూరు: అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నేడు కర్ణాటకలో జయనగర, ఆర్ఆర్ నగర మినహా 222 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ బటన్ నొక్కినా కేవలం కమలం గుర్తుకే ఓట్లు వెళ్తున్నాయని కాంగ్రెస్ నేత బ్రిజేష్ కలప్పా ట్వీట్లు చేశారు. బనహట్టిలో ఈవీఎంల సమస్య కారణంగా రెండు గంటల పాటు పోలింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.
‘బెంగళూరులోని ఆర్ఎంవీ 2 స్టేజ్. మా అమ్మానాన్నలుండే అపార్ట్మెంట్ ముందు ఐదు పోలింగ్ బూత్లున్నాయి. అందులోని రెండో బూత్లో మాత్రం ఓటేసేందుకు ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయి. అందుకే ఈ విషయం తెలుసుకుని ఆగ్రహించిన ఓటర్లు ఓటేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. తమకు ఈవీఎంలపై మూడు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని మరో ట్వీట్ చేశారు. రాంనగర, చమరాజ్పేట్, హెబ్బల్ లలో పలుచోట్ల ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమకు ఫిర్యాదు అందాయని, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని’ బ్రిజేష్ కలప్పా పేర్కొన్నారు.