తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి | AP BJP Leaders Meet CEC And Complaint On Data Breach In Delhi | Sakshi
Sakshi News home page

తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి

Mar 8 2019 12:22 PM | Updated on Mar 8 2019 2:32 PM

AP BJP Leaders Meet CEC And Complaint On Data Breach In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్‌, ఓటర్‌ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ ప్రజల ఓటార్‌ ఐడీ కార్డు వివరాలు, ఆధార్‌ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్‌ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!)

ఏపీ డీజీపీని మార్చాలి..
ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల  జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్‌ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్‌ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు.

ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్‌ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్‌ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్‌ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్‌ ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement