
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు పళని ప్రభుత్వం కూడా వెనకంజ ఎందుకు వేస్తుందన్న ప్రశ్న ఆమె అభిమానులను ఇప్పటికీ వేదిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కీలక నేత దిండిగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలమే రేపుతున్నాయి.
తీవ్ర అస్వస్థకు గురైన జయలలితను గత ఏడాది సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం అన్నాడీఎంకే పార్టీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి హాజరైన శ్రీనివాసన్ మాట్లాడుతూ... ఆమ్మ ఆస్పత్రిలో ఉన్న సమయంలో తాను మీడియా ముందు అబద్దపు ప్రకటనలు చేశానని చెప్పారు. ‘‘ఆ సమయంలో సోషల్ మీడియాలో అమ్మ ఆరోగ్యంపై పుకార్లు చెలరేగాయి. పార్టీని కాపాడుకునేందుకు కీలక నేతలు ఆమె కోలుకుంటుందని ప్రకటనలు చేశారు. కానీ, నిజానికి లోపల ఏం జరిగిందో? ఆమె ఎలా ఉందో? ఎవరికీ తెలియని పరిస్థితి’’ అని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.
‘జయకు ఓవైపు చికిత్స జరుగుతున్న సమయంలో ఆమె ఉన్న అంతస్తులోకి ఎవరినీ అనుమతించలేదు. గవర్నర్ విద్యాసాగర్ రావుసహా బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. కేంద్ర మంత్రి అరుణ జైట్లీ ఇలా ప్రముఖులను కూడా ఆమెను చూడనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. వారందరినీ అపోలో ఆస్పత్రుల హెడ్ ప్రతాప్రెడ్డి గదిలో కూర్చోబెట్టి ఆమె మాట్లాడారు. ఈ లెక్కన్న అమ్మ మృతిపై అనుమానాలు.. మరణం వెనుక ముమ్మాటికీ శశికళ, దినకరన్ హస్తం ఉంది’’ అంటూ శ్రీనివాసన్ ఆరోపించారు.
అయితే దినకరన్ మాత్రం శ్రీనివాసన్ చేసిన ఆరోపణలను ఖండించారు. అక్టోబర్ 1 తర్వాత శశికళ అసలు జయలలిత దగ్గరే లేదని, పైగా జయను పరామర్శించినట్లు స్వయంగా గవర్నరే చెప్పిన విషయాన్ని దినకరన్ ప్రస్తావించారు. మొత్తానికి ఆస్పత్రిలో ఉన్న 72 రోజుల్లో... 65 రోజులు ఆరోగ్యంగానే ఉన్నారని.. పాలనా వ్యవహారాలు చూసుకోవటం.. కావేరీ జల వివాదంపై ప్రకటన.. ఉప ఎన్నిక గురించి ప్రస్తావన.. చివరకు తమిళ ప్రజల పూజలతో పునర్జన్మ అంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ పచ్చి అబద్ధమని శ్రీనివాసన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైపోయింది.