అద్వితీయం | Sakshi
Sakshi News home page

అద్వితీయం

Published Sun, Jun 9 2019 1:23 PM

Adimulapu Suresh And Balineni Srinivasa Reddy Sworn In AP Cabinet - Sakshi

ఒంగోలు సిటీ: రాష్ట్ర మంత్రివర్గంలో ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగానే సీనియర్‌ నేత, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డికి తన మంత్రివర్గంలో తొలి ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు బాలినేనితో పాటు మరో మంత్రి పదవిని బహుమతిగా ఇచ్చారు. అదీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం కల్పించారు.  విద్యాధికుడు ఆదిమూలపు సురేష్‌ను విద్యాశాఖ మంత్రి పదవి వరించింది. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు రావడం ఇదే ప్రప్రథమం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇరువురిని మంత్రులుగా ప్రకటించడం సంచలనమే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి రావడం ఇది రెండోసారి. కాంగ్రెస్‌ నుంచి దివంగత నేత జీవీ శేషు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఈ సమాజికవర్గం నుంచి ఎస్సీ మంత్రులు జిల్లా నుంచి లేరు. చాలా ఏళ్ల తర్వాత సురేష్‌కు మంత్రి పదవి ఇచ్చి ఎస్సీలకు ప్రాతినిథ్య లోటును జగన్‌ భర్తీ చేశారు.

గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం
రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ జగన్‌ కోటరీలోని మంత్రులతో పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. శనివారం వెలగపూడిలో ఈ కార్యక్రమం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను అంటూ తెలుగులో బాలినేని పదవీ ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్‌ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. విద్యాధికుడు, పశ్చిమ ప్రాంతానికి ప్రాతినిథ్యం ఇవ్వడంలో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గానికి జగన్‌ తన మంత్రి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం అన్ని వర్గాల్లో, అభిమానుల్లో హర్షాతిరేకాలు ఎదురవుతున్నాయి. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బాలినేని,  సురేష్‌లను పలువురు అభినందించారు. ఘనంగా సన్మానించారు.
 
ఎంతో గర్వంగా ఉంది : బాలినేని
రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సాక్షితో మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి మండలిలో తాను గనుల శాఖ మంత్రిగా పని చేశానని అన్నారు. ఆయన తనయుడు జగన్‌ ముఖ్యమంత్రిగా మంత్రి మండలిలో విద్యుత్తు, అటవీశాఖ మంత్రిగా చేస్తున్నానని అన్నారు. ఇరువురి మంత్రి మండలిలో తనకు గౌరవం దక్కినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. పదవికి వన్నె తెచ్చే విధంగా పని చేస్తానని, పారదర్శక పాలన అందిస్తామని చెప్పారు.  జగన్‌ «ఆశయాలు, ఆలోచనలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్, గవర్నర్‌ నరసింహన్‌ల సమక్షంలో మంత్రులుగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తున్న

Advertisement
Advertisement