ధారణే ఆయన ఆభరణం | Rallabandi Kavitaprasad | Sakshi
Sakshi News home page

ధారణే ఆయన ఆభరణం

Mar 18 2015 1:47 AM | Updated on Sep 2 2017 10:59 PM

డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్

డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్

కవితా ప్రసాద్- కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో రామకోటీశ్వరరాజు అనే బడిపంతులు పెద్దకొడుకు.

 నివాళి
 కవితా ప్రసాద్-  కృష్ణా జిల్లా నెమలి గ్రామంలో రామకోటీశ్వరరాజు అనే బడిపంతులు పెద్దకొడుకు. తిరగబడ్డ ట్రాక్టర్ నాగ లి కింద కాలు నుజ్జు అయిన బాలుడు. తండ్రి భుజా లపై రెండు ఏర్లను దాటి ఆసుపత్రికి చేరినవాడు. ఇప్పటికీ జీవించి ఉన్న అమ్మ రత్నవర్ధనమ్మ  మైళ్ల దూరపు ఆసుపత్రికి మోసుకెళ్లగా నేలపై కాలూన్చిన వాడు. ఇంటర్‌లో  చెప్పులు, డిగ్రీలో మెరుగైన ప్యాంటూ, గ్రూప్ వన్  నెగ్గాక  బూట్లు తొలిసారి వేసుకున్నవాడు. రాళ్లబండికి షార్ట్‌కట్స్ ఇష్టం ఉం డదు. నొప్పించాలని అనుకోరు. కానీ, ఆయన ఆత్మ విశ్వాసం కొందరిని నొప్పించినా ఆశ్యర్యం లేదు.

 రాళ్లబండి గ్రూప్ వన్ రాసే రోజుల్లో కాంపిటీ షన్ సక్సెస్ రివ్యూ పత్రిక పరీక్షహాల్ నుంచి వచ్చిన వారికి మెమరీ టెస్ట్  పెట్టేది. మొత్తం 150 ప్రశ్నలను చెప్పినవారికి నూరు రూపాయలు బహుమతి. ప్రశ్న లు రాసి బహుమతులు పొందాడు రాళ్లబండి. ఈ శక్తి అతనికి ఎలా వచ్చింది? తండ్రి రామ కోటీశ్వర రాజు భారత, భాగవత, రామాయణాలను ధారణ చేసిన వ్యక్తి. ఈ ‘పెద్దోడు’ బాల్యంలోనే గ్రహించా రు. పద్యాన్ని పాటలా పాడటం అబ్బింది. అం తేనా?  వినడం, విన్నది ప్రాసెస్ చేసుకోవడం గురిం చి, పురాతన భారతీయ విద్య ఆధారంగా తండ్రి ఉదాహరణలతో చెప్పేవాడట.

 ‘నాగేశ్వరరావుగారు నొచ్చుకున్నారు....!’ ఫోన్ మాట్లాడడం అయ్యాక బాధగా అన్నారు రాళ్లబండి కవితాప్రసాద్ ఒక సందర్భంలో.. ఏమిటి కారణం?  కళాప్రపూర్ణ అక్కినేని నాగేశ్వరరావుగారు పుట్టిన రోజు సందర్భంగా స్వర్ణకంకణం తొడగాలనుకు న్నారు. ‘నాకు బాగా నచ్చిన వ్యక్తి మీరు, అంగీకరిం చండి’ అన్నారాయన. తాను సాంస్కృతికశాఖ డెరైక్టర్. ఈ సత్కారాలు సముచితమా? ‘ఔచితీ భం గం సాహిత్యంలోనే కాదు జీవితంలోనూ కూడదు’ అనుకున్నారు రాళ్లబండి! ఇది ఆయన వ్యక్తిత్వం.

 ఉద్యోగం సంపాదించడం ఎట్లా అని చెబుతూ  రాళ్లబండి ఇటీవల చెప్పిన కథ వేలాది యువజనుల స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. భోజరాజు కొలు వులో దండి, భవభూతి, మాఘుడు ముఖ్యులు. దండి  ఏకసంథాగ్రాహి. భవభూతి ‘ద్వి’. మాఘుడు ‘త్రి’. కొలువులో చోటు కోసం ఎవరు వచ్చినా, ఏ శ్లోకం చెప్పినా దండి ‘ఇది నేను రాసిందే!’ అనే వాడు. భవభూతి ‘అవును దండిదే!’  అని చెప్పే వాడు. మాఘుడు ‘ముమ్మార్లూ దండిదే పద్యం!’ అనేవాడు. ఇహ కొలువు ఎట్లా, కొత్తవారికి! అప్పుడే కాళిదాసు సభకు వచ్చాడు. ముగ్గురూ తేజోమూ ర్తులు. జ్ఞానకాంతులు. దండికి డెబ్భై ఏళ్లు. పళ్లు లేవు. పళ్లులేని వారు పలకలేని ‘‘షడ్జ్యామడ్జ్య...’ చది వాడు. దండి ఉచ్చరించలేడు. మిగిలిన ఇరువురూ ఏకసంథాగ్రాహులు కారుకదా! భాషను వినియోగిం చడంలో కాళిదాసు వలె ‘ఇంటలిజెన్స్’ ఉపయోగిం చాలని చమత్కరించేవారు రాళ్లబండి. అవధాన విద్య ఆరంభ వికాసాలపై అవధానులందరూ అభినందించేలా పరిశోధన చేసిన రాళ్లబండి పద్య మండపానికే కాదు, ఆధునిక కవితకూ భూషణమే. గతంలోని ‘కొంచెం మంచీ’ తెలిసిన అరుదైన ప్రతి భాశాలి. నోబెల్ బహుమతి పొందిన 30 మంది కవుల కవితలను ‘అర్థాంతరం’ పేరుతో అనువది స్తోన్న రాళ్లబండి అర్థాంతరంగా అదృశ్యమయ్యారు.  ఐఏఎస్ ఆఫీసర్ ముక్తేశ్వరరావు ఇచ్చిన చెక్కుతో ఆసుపత్రి నుంచి ‘విముక్తుడైన’  రాళ్లబండి మిగిల్చు కున్నది పదివేల పుస్తకాల ఆస్తి!

 పున్నా కృష్ణమూర్తి
 సీనియర్ జర్నలిస్ట్
 మొబైల్: 7680950863

Advertisement
 
Advertisement
Advertisement