అన్నదాతను ఆదుకోరా? | ollow a strategy of former suicide prevention | Sakshi
Sakshi News home page

అన్నదాతను ఆదుకోరా?

Apr 26 2015 1:56 AM | Updated on Nov 6 2018 7:56 PM

అన్నదాతను  ఆదుకోరా? - Sakshi

అన్నదాతను ఆదుకోరా?

న్నదాతల ఆత్మహత్యల నివారణకు అనుసరించవలసిన వ్యూహం ....

 త్రికాలమ్

గత సార్వత్రిక ఎన్నికలలో అద్భుతమైన వాగ్ధాటితో ప్రజలను మైమరిపించి వైరిపక్షాలను చిత్తు చేసి అధికారం కైవసం చేసుకున్న నాయకులు ఇద్దరు. ఒకరు ప్రధాని నరేంద్రభాయ్ మోదీ, మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తక్కిన విజేతలకు పరిస్థితులు అనుకూలించి ఉండవచ్చు. ప్రత్యర్థులు తప్పులు చేసి ఉండవచ్చు. పార్టీ కార్యకర్తలు అహర్నిశలూ కృషి చేసి అభ్యర్థులను గెలిపించి ఉండవచ్చు. పార్టీ యంత్రాంగం లేనిచోట సైతం ప్రభావవంతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకున్న నాయకులు మాత్రం వీరిద్దరే. ఇద్దరూ ఎవ్వరూ ఊహించనంత ఘనవిజయాలు సాధించారు. అధికారంలోకి వచ్చారు.
 ఎన్నికలు గెలుచుకోవడం వేరు పరిపాలన సమర్థంగా చేయడం వేరు. వాగ్దేవి కటాక్షం అన్ని వేళలా రక్షించదు. ప్రజల అనుభవానికి భిన్నమైన అంశాలను ఎంత ఘాటుగా చెప్పినప్పటికీ అవి మనస్సుకు హత్తుకోవు. చెప్పే విషయాలు అసత్యాలో, అర్ధసత్యాలో అయినప్పుడూ చెప్పేవారి విశ్వనీయత తగ్గిపోతుంది. ఆశించిన ప్రయోజనం సిద్ధించదు. ఇది అనేక సందర్భాలలో నిగ్గుతేలిన నిజమే అయనప్పటికీ రాజకీయ నాయకులు గుణపాఠాలు నేర్చు కోరు. తాము ఇతరులకంటే తెలివిగలవారమనీ, ఇతరులు చేయలేని పని తాము చేయగలనమనీ భ్రమిస్తారు. ఫలితం అనివార్యంగా అనుభవిస్తారు.

జాతి యావత్తూ సిగ్గుతో తలదించుకోవలసిన అంశాన్ని ప్రధానులూ, ముఖ్యమంత్రులూ ప్రస్తావించనంత మాత్రాన సంక్షోభం సమసిపోదు. శుక్ర వారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి డెలిగేట్ల సమావేశంలో కేసీఆర్ ఎప్పటి లాగే ధాటిగా మాట్లాడారు. ఆత్మస్తుతి కొంత పెరిగినా పరనింద కొంచెం తగ్గింది. తన సుదీర్ఘ ప్రసంగంలో అన్ని విషయాలూ ప్రస్తావించారు కానీ రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడలేదు. అప్పుల ఊబిలో కూరుకొని పోయి అవమానభారంతో రైతులు బలవన్మరణం చెందుతున్నారనే కఠోరవాస్తవాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించనంత మాత్రాన సమస్య అదృశ్యమైపోదు. రాహుల్ గాంధీ కిసాన్ యాత్రను తెలంగాణలో, అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లోనే, త్వరలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నార ని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మెదక్ జిల్లాలో ఇంతవరకూ 67 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. సంఖ్య ఎక్కువో తక్కువో కావచ్చు కానీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న మాట మాత్రం ఎవ్వరూ కాదనలేని చేదు నిజం.

సోమవారం జరిగే టీఆర్‌ఎస్ బహిరంగ సభలోనైనా ముఖ్యమంత్రి ఈ సంక్షోభం పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తే నిజాయితీగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సృష్టించింది కాదు. 1996 నుంచీ అనంతంగా కొనసాగుతున్న విషాదమే. ఏ ప్రభుత్వాన్నో, ఏ ముఖ్యమంత్రినో తప్పుపట్టడం కాకుండా సంక్షోభం పరిష్కారంకోసం రాజకీయాలకు అతీతంగా సమాజం యావత్తూ నడుంబిగించవలసిన సందర్భం ఇది. ఈ విషయంలో చొరవ తీసుకుంటే కేసీఆర్‌కే మరింత ఖ్యాతి దక్కుతుంది. ఇప్పటికే ఆయన అనితర సాధ్యమైన రీతిలో సుదీర్ఘకాలం ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా చరిత్ర పుటలలోకి ఎక్కారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలూ, ఎస్‌సీ ఎస్‌టీ సబ్‌ప్లాన్ చట్టం జయప్రదంగా అమలు జరిగితే కేసీఆర్‌కి జనరంజకుడైన పాలకుడిగా, సమాజంలో అసమానతలకు తగ్గించడానికి అంకితభావంతో కృషి చేసిన రాజనీతిజ్ఞుడుగా గొప్ప పేరు వస్తుం ది. అంతే కాని, అన్నతాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అది బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది? అందుకే వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కా రానికి మార్గం అన్వేషించాలి. ప్రధానితో, ఇతర ముఖ్యమంత్రులతో కలసి సమాలోచనలు చేయాలి.

రైతు ప్రాణంతో రాజకీయం

రాజస్థాన్ రైతు గజేంద్రసింగ్ జంతర్‌మంతర్‌లో చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకోవడంతో దేశమంతటా అది చర్చనీయాంశం అయింది. ప్రధాని సంతాపం తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గజేంద్రసింగ్ కుటుంబ సభ్యులను కలుసుకొని సానుభూతి వెలిబుచ్చారు. విదర్భలో, తెలంగాణలో, బుందేల్‌ఖండ్ (యూపీ)లో రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించలేదు. వారిని అమిత్ షా వెళ్ళి కలవలేదు. ‘జైజవాన్, జైకిసాన్’ అంటూ నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి నినదిస్తే ‘మర్‌జవాన్,మర్‌కిసాన్’ అని నేటి యూపీఏ సర్కార్ అంటున్నదంటూ ఎన్నికల ప్రచారంలో నిశితంగా, నిర్దయగా విమర్శించిన నరేంద్రమోదీ ఏమి చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్‌ను కాపాడేందుకు చొరవ తీసుకుంటారనీ, తక్షణ సహాయం ప్రకటించి దీర్ఘకాలిక పరిష్కారంకోసం ప్రయత్నిస్తారనీ భావించినవారికి ఆశాభంగం కలిగించారు. పైగా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ రెండు సార్లు జారీ చేయించారు. గిట్టుబాటుకాని వ్యవసాయం నుంచి ప్రజలను పరిశ్రమలకూ, సేవారంగానికి మళ్ళించేందుకే భూసేకరణ ఆర్డినెన్స్ జారీ చేశామంటూ ఎన్‌డిఏ సర్కార్ చేస్తున్న వాదన రైతులోకానికి సమంజసంగా కనిపించడం లేదు. ముందు రైతులను ఆదుకోవడానికి సమగ్ర పంట బీమా పథకం ప్రకటించి, తర్వాత భూసేకరణ ఆర్డినెన్స్ తెచ్చినా అర్థవంతంగా ఉండేది. రైతుల ఆమోదం లేకుండా భూములు తీసుకుంటామని ఒకవైపు చెబుతూ ఇదంతా రైతుల మేలుకోసమే అనడం అతకడం లేదు.
 
చైనా ఆదర్శం అనుసరణీయం


వాస్తవానికి 2013లో భూసేకరణ చట్టం తెచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల నివారణకు చేసింది ఏమీలేదు. ఆ సర్కార్ హయాంలోనే దాదాపు రెండు లక్షల మందికిపైగా అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ 2013 భూసేకరణ చట్టం ద్వారా రైతుల అనుమతి లేకుండా భూములు లాక్కొని పరిశ్రమలకో, వ్యాపారానికో ఇవ్వబోమన్న నమ్మకం కలిగించింది. ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ నమ్మకాన్ని భూసేకరణ చట్టం సవరణ బిల్లు ద్వారా వమ్ము చేస్తున్నది. పరిశ్రమలు విస్తరించాలంటే, సంపద పెరగాలంటే భూములు సేకరించక తప్పదంటూ వాదిస్తున్నది. చివరికి ఇది మోదీకి ప్రతి ష్ఠాత్మకమైన అంశంగా పరిణమించింది. సవరణ బిల్లును మధ్యలో వదిలేస్తే తనది బలహీనమైన ప్రభుత్వం అంటూ ముద్రవేస్తారనే భయం మోదీని పీడిస్తూ ఉండవచ్చు.. ఈ సమస్య ఎంతటి తీవ్రమైనదంటే అన్నదాతల ఆత్మ హత్యల నివారణకు అనుసరించవలసిన వ్యూహం రూపొందించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించినా తప్పులేదు. ఇంతకాలం దారుణంగా నిర్లక్ష్యం చేసినందుకు రైతులోకానికి క్షమాపణ చెబుతూ పార్ల మెంటు తీర్మానం చేయాలి. మనిషి ప్రాణానికి మించింది ఏమీ లేదంటూ గజేంద్రసింగ్ మరణం సందర్భంగా వ్యాఖ్యానించిన ప్రధాని ఎన్‌డీఏ అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా వేలమంది రైతులు బలవన్మరణం చెందుతుంటే స్పందించకుండా ఎట్లా ఉండగలుగుతున్నారు?
 గజేంద్రసింగ్ మరణంపైన దేశీయాంగమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెం టులో మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం మంది వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం భాగం 14 శాతం. అంటే 14వ శాతం జాతీయ ఆదాయాన్ని 60శాతం జనాభా పంచుకుంటున్నారు. మన దేశంలో 15 శాతం వ్యవసాయ భూములకే బీమా భద్రత ఉన్నదని నీతిఆయోగ్ సభ్యుడు అశోక్ గులాటీ వెల్లడించారు. చైనాలో 80 శాతం భూములకు బీమా సౌకర్యం ఉంది. గ్రామాలలో ప్రజలు వ్యవసాయాధార పరిశ్రమలు పెట్టుకొని ఆదాయం పెంచుకుంటున్నారు. టౌన్‌షిప్ అండ్ విలేజ్ ఎంటర్‌ప్రైజ్ (టీవీఇ) పథకాన్ని 1978లోనే చైనాలో ఆర్థిక సంస్కరణలతో పాటే డెంగ్ ప్రవేశపెట్టాడు. చైనా స్థూల ఉత్పత్తిలో 30 శాతం ఈ పరిశ్రమద్వారా వస్తున్నదే. చైనాలో నాలుగు రోజులు ఉండి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడి వ్యవసాయాధార పారిశ్రామిక వ్యవస్థను కూడా పరిశీలించి ఉంటే బాగుండేది. భారత్‌కూ, చైనాకూ జనాభాలో, వాతావరణంలో, ఇతర అనేక అంశాలలో సామ్యం ఉన్నది కనుక అక్కడి పథకాలు ఇక్కడ కూడా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించడంలో తప్పులేదు.

ప్రజలను వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మళ్లించవలసిందే. ఆదాయంలేని రంగం మీద అధికశాతం జనాభా ఆధారపడటం అనవసరం. చదువు అంతంత మాత్రంగా ఉండి, వ్యవసాయం మినహా తక్కిన పనులు చేయలేనివారిని అకస్మాత్తుగా వేరే రంగాలకు మళ్ళించడం సాధ్యంకాదు. ఇది క్రమంగా, అవగాహనతో, అంగీకారంతో జరగవలసిన పరిణామం. అంత వరకూ తాత్కాలికంగా రైతులను ఆదుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాలతో సమాలోచనలు జరిపి పరి ష్కార మార్గాలు అన్వేషించాలి. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గిన కారణంగా ఆదా అయిన విదేశీమారక ద్రవ్యాన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ కంటే, ఇంతవరకూ మోదీ ప్రభు త్వం చేపట్టిన ఇతర ఉద్యమాలకంటే కూడా ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. అన్నదాతను ఆదుకోని అధికారం ఎందుకు?
 
అన్నదాతల ఆత్మహత్యల నివారణకు అనుసరించవలసిన వ్యూహం రూపొందించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించినా తప్పులేదు. ఇంతకాలం దారుణంగా నిర్లక్ష్యం చేసినందుకు రైతులోకానికి క్షమాపణ చెబుతూ పార్ల మెంటు తీర్మానం చేయాలి.
 
 కె.రామచంద్రమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement