
ఆ మరణం మాకొక పాఠం
మార్క్సిస్టుల ప్రాధాన్యాల విషయంలో ఈ కుల వ్యతిరేక పోరాటానికి, ప్రత్యేకించి మన దేశ పరిస్థితులలో ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారనే భావిస్తున్నాను.
విశ్లేషణ
మార్క్సిస్టుల ప్రాధాన్యాల విషయంలో ఈ కుల వ్యతిరేక పోరాటానికి, ప్రత్యేకించి మన దేశ పరిస్థితులలో ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారనే భావిస్తున్నాను. నేను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉన్నపుడు 11 మంది ఉండేవారు. అందులో ఒక్క దళితుడు, వెనుక బడిన కులాలకు చెందినవారు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు ఒక్కరూ లేరు. అలా అని మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ కులతత్వం ఉందని ఇప్పటికీ భావించలేను. అంబేడ్కర్ భావజాలం మీద తగిన అధ్యయనం, చర్చ జరగకపోయేది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య మనసున్న మనుషులందరినీ కలవరపరిచింది. అధికార దర్పం, అగ్రకుల దురహంకారం, కాసుల గల వారి కావరం; వీటికి తోడు కేంద్ర మంత్రుల అండ, మానవత్వం లేని చర్య కారణంగా రోహిత్ నేలకొరిగాడు. ఉగ్రవాదులు, జాతివిద్రోహులు విశ్వవిద్యాలయంలోకి చొరబడి దాడులకు తెగబడ్డారనీ, వారిపై చర్యలు తీసుకోవాలనీ ఒక తప్పుడు విజ్ఞాపనను ఏబీవీపీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయకు సమర్పించింది. అందులోని వాస్తవాలను పరిశీలించకుండానే సదరు అమాత్యులు, తన కవిత్వం కూడా జోడించి మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి పంపారు. ఆమె ఈ అంశాన్ని విశ్వవిద్యాలయం అధిపతులకు పంపింది. అధికారులు రోహిత్ సహా, ఐదుగురు అంబే డ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) సభ్యుల మీద చర్య తీసు కున్నారు.
హాస్టల్ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా, ఇతర ఆంక్షలు కూడా విధించారు. ఇప్పుడు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ తమ తప్పేమీ లేదని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూశాక, 73 సంవత్సరాల వయసులో, అనారోగ్యంతో ఉన్న నాకు మాత్రం రోహిత్కు క్షమాపణ చెప్పడం భావ్యం అనిపించింది. ‘‘రోహిత్! నాకు సిగ్గుగా ఉందయ్యా! క్షమించు. అణగారిన కులాల వారినీ, పేదలనూ అనుక్షణం అవమా నిస్తూ; వారి మీద దౌర్జన్యాలు చేస్తున్న సమాజాన్ని కూల్చి, ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో మనిషిగా జీవించగలిగే మరో వ్యవస్థను మీకు అందించలేకపోయినందుకు నిజంగా సిగ్గుగా ఉందయ్యా! మమ్మల్ని క్షమించు!’’
ఆర్థికాభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందట! అత్యధిక కోటీశ్వరులు ఉన్న ఆసియా దేశాలలో కూడా మన దేశానిదే మూడో స్థానమట! స్వచ్ఛ భారత్గా రూపొందుతున్నదట! మన పాలక పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ తలసరి ఆదాయంలో అడుగు నుంచి మూడో స్థానంలో ఉన్నదట. ఆ నిరుపేదలలో కష్టజీవులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు అధికులు. రోహిత్, అతనితో పాటు సస్పెండైన నలుగురు వ్యవసాయ కూలీల కుటుంబాల వాళ్లే. రోహిత్ తల్లి కొడుకు మీద గుండెల నిండా ప్రేమ నింపుకుని, తన కడుపు కట్టుకుని చదివించింది. ఆమె ఒక టైలర్. సస్పెండై ‘వెలివాడ’లో దీక్ష చేసిన ఆ ఐదుగురు దళితులే.
గత దశాబ్ద కాలంలో ఇదే విశ్వవిద్యాలయంలో 11 మంది ఆత్మహత్య చేసుకుంటే, అదేమిటో; వారిలో తొమ్మండుగురు దళితులే. ఇద్దరు బాగా వెనుకబడిన కులం వారు. 2008లో ఆత్మహత్య చేసుకున్న సెంథిల్ కుమార్ అనే పరిశోధక విద్యార్థి ఎరుకుల వర్గం వాడు. కళ్లకు కట్టినట్టు ఈ వాస్తవాలు కనిపిస్తుంటే మన పాలకులు తమ దోషం ఏమీ లేదంటున్నారు. ‘రోహిత్! నీ ఆత్మహత్య ముందే తెలిసి ఉంటే చచ్చి సాధించేదేమీ ఉండదని చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పలేను. నీవు రాసిన గుండెలు పిండే లేఖ అందులో ఆకాశంలో తారగా వెలగాలన్న నీ ఆకాంక్ష తెలుసుకున్న తరువాత ఇక చెప్పవలసిందేం మిగిలింది? ‘నా పుట్టుకే నాకు విషాదమైన యాక్సిడెంట్ అన్న మాటతో మేం చేయవలసింది- నీ నుంచి నేర్చుకోవడమే!’
వర్ణ వివక్ష మీద లోపించిన దృష్టి
నేను మార్క్సిస్టును. అంటే మార్క్సిజాన్ని ఇష్టపడేవాడిననే అర్థంలో! రోహిత్ అంబేడ్కర్ను బాగా అధ్యయనం చేసినవాడు. ఇంతకు ముందు పేర్కొన్న కుమార్ అంబేడ్కర్-పెరియార్ స్టూడెంట్స్ అసోసియేషన్కు చెందినవాడు. మహారాష్ట్రలో అంబేడ్కర్-ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఉంది. వీరంతా ఆయా నాయకుల భావజాలంతో ప్రభావితమైనవారే. అలాగే వీరంతా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉంటారనీ, దేశంలో మార్క్సిస్ట్ పార్టీల వ్యవహారశైలిని గమనించిన వారేననీ చెప్పగలం. వామపక్షాలు కూడా కుల వ్యతిరేక పోరాట ప్రాముఖ్యాన్ని గుర్తించాయని ఒక సందర్భంలో రోహిత్ చెప్పినా, వారిది ద్వంద్వ వైఖరి అని విమర్శించాడు.
మార్క్సిస్టు పార్టీల వైఖరి సంగతేమో కానీ, నా వరకు నేను మార్క్సిస్టుల ప్రాధాన్యాల విషయంలో ఈ కుల వ్యతిరేక పోరాటానికి, ప్రత్యేకించి మన దేశ పరిస్థితులలో ఇవ్వవ లసినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారనే భావిస్తున్నాను. నేను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉన్నపుడు 11 మంది ఉండేవారు. అందులో ఒక్క దళితుడు, వెనుకబడిన కులాలకు చెందినవారు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు ఒక్కరూ లేరు. అలా అని మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ కులతత్వం ఉందని ఇప్పటికీ భావించలేను. మొత్తం మీద అంబేడ్కర్ భావజాలం మీద తగిన అధ్యయనం, చర్చ జరగకపోయేది. వర్గపోరాటమే సమాజ పరిణామక్రమంలో ఏకైక పోరాట రూపం అన్న అంశం మా ఆలోచనా ధోరణిలో కరడగట్టుకు పోయిందని చెప్పాలి.
మన పార్టీలో ఏ వర్గానికి చెందినవారు, ఏఏ స్థాయిలలో నాయ కత్వం వహిస్తున్నారు? అన్న అంశాన్ని అప్పుడప్పుడు బేరీజు వేసుకుని, ఇంకా శ్రామిక వర్గం నుంచి తగిన రీతిలో, ప్రత్యక్ష శ్రామిక వర్గ పాత్ర తగినంతగా లేదు కాబట్టి, పార్టీ నాయకత్వం పెంచుకోవాలని అనుకునేవారం. కానీ ఎప్పుడూ నాయకత్వ స్థానాలలో కుల సమీకరణ గురించి చర్చించేవారమే కాదు. పైగా ఆ కుల ప్రస్తావన తేవడం అంటే శ్రామిక వర్గ ఐక్యతకు భంగం కలిగించడమేననే భావన ఉండేది. 1986-87 ప్రాంతంలో కృష్ణారావు అనే అధ్యాపకుడు (సూర్యాపేట) రాజకీయ పార్టీలలో కుల ప్రాధాన్యం-అంతర్గత ప్రజాస్వామ్యం అనే అంశం మీద పరిశోధన చేస్తూ నన్ను కలిశారు. ‘మీ రాష్ట్ర కమిటీలో, కార్యదర్శివర్గంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు ఎందరు ఉన్నారని ప్రశ్నించారు.
‘మా పార్టీలో రాజకీయ బాధ్యతల విషయంలో రిజర్వేషన్లు ఉండవు’ అని సమాధానం ఇచ్చాను. తరువాత ఎప్పుడో అంబేడ్కర్, ఇతర సామాజిక నేతలను అధ్యయనం చేసిన తరువాత అది సరైన సమాధానం కాదని కొంతవరకు గుర్తించగలిగాను. ప్రస్తుత పరిస్థితులలో మార్క్సిస్టులలో సానుకూల మార్పు వచ్చిందని మాత్రం భావిస్తున్నాను. ఉదా: సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఇప్పుడు దాదాపు 40-45 శాతం అణచివేతకు గురవుతున్న వారికి ప్రాతినిధ్యం కనిపిస్తుంది.
మార్క్సిస్టులు, సామాజిక ఉద్యమకారులు కలవాలి
వర్ణ వివక్షపై జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు వ్యతిరేకంగా ఉన్నారనో, ఈ అంశం వారి దృష్టిలో లేదనో భావించడం కూడా సరికాదు. మనుస్మృతి నిర్దేశంతో దశాబ్దాలుగా దేశంలో ఉన్న ఈ అంశం మీద సర్దేశాయ్, ఈఎంఎస్ వంటి నేతలు మార్క్సిజం సాధారణత నుంచి కాకుండా, మన దేశ ప్రత్యేక అంశంగా దీనిని గుర్తించారు. మన దేశంలో బానిస వ్యవస్థ, కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిందని ఈఎంఎస్ స్పష్టం చేశారు. ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య వంటివారు దళిత, వెనుకబడిన వర్గాలపై, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆరంభంలో పోరాడిన సంగతిని విస్మరించలేం. ఈ అణగారిన శ్రమ జీవులు పోరాటం ద్వారా ఈ వ్యవస్థను మార్చగలిగితే వర్ణ వివక్ష సైతం అంతరించి, అణచివేతల నుంచి విముక్తి కలుగుతుందన్న భావన బలంగా ఉండేది.
నిజానికి పునాదులు పెకలించాలంటే, ముందు అంతస్తులు కూల్చాలి. కాబట్టి పునాది, ఉపరితల నిర్మాణం పరస్పర ఆధారితాలే. ఈ గ్రహింపుతో పాటు దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక వివక్షపై కూడా వర్గ పోరాటంతో సమంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందనీ; ఈ వర్గ పోరాటం, వర్ణ (కుల) నిర్మూలనా పోరాటం కూడా పరస్పర ఆధారితాలేనన్న స్పృహతో దేశంలో కమ్యూనిస్టు పోరాటాలు విరివిగా జరిగేవి. నిజానికి ఈ పార్టీల నాయకత్వంలో సైతం ఈ స్పృహ తగినంతగా లేని ఫలితంగానే అక్కడక్కడ ఆ పార్టీలలో కులతత్వ ధోరణులు కనపడుతున్నాయి. ఇదంతా మార్క్సిస్టులను కించపరచడానికి చెబుతున్నది కాదు. వారి దృక్పథాన్ని ఇంకా సంపద్వంతం చేయడానికే.
మార్క్స్ అనుయాయులు, ప్రధానంగా శ్రమజీవులూ; ఇటు సామాజిక అణచివేతను అంతమొందించేందుకు కృషి చేసిన అంబేడ్కర్, ఫూలే, పెరియార్ వంటి సామాజిక నేతల అనుయాయులూ; దేశమంటే మట్టికాదు, మనుషులని నమ్మే పోరాట శక్తులు కలసి మహత్తర పోరాటాల ద్వారా ఈ దోపిడీకీ, అణచివేతకూ చరమగీతం పాడాలి. అంబేడ్కర్కు కూడా కమ్యూనిస్టుల మీద ద్వేషం లేదు. కానీ దేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, కుల నిర్మూలన కార్యక్రమాన్ని వీరు ప్రత్యేకంగా నిర్వహించకపోవడం పట్ల ఆయన సహజంగానే నిరాశ చెందారు. కమ్యూనిజం నిరంకుశ ధోరణులకు దారి తీస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. ఏఎస్ఏ అనుయాయుల విషయం కూడా అంతే.
వర్గ పోరాటంతోనే కమ్యూనిస్టులు అగ్రవర్ణ దురహంకారాన్నీ, వర్ణ వివక్షను ఎదుర్కొనలేరని, ఆ మార్గంలో కుల రహిత సమాజం సాధించలేమని వారి అభిమతం. అంబేడ్కర్ ఆలోచనా విధానం, మార్క్సిజం ఇచ్చే శాస్త్రీయ సామాజిక పరిణామ అవగాహన పరస్పరం సహకరించుకుంటూ, కమ్యూనిస్టులు, సామాజిక ఉద్యమాల నేతలు కలసి పనిచేయవలసిన తరుణమిది. అదే రోహిత్కు మనమివ్వగలిగిన నివాళి.
డా॥ఎ.పి. విఠల్, (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు, 98480 69720)