‘లేచి నిలబడు..డ్రామా ఆపమంటూ అరిచారు’ | Woman On Wheelchair Asked To Stand At Delhi Airport | Sakshi
Sakshi News home page

‘డ్రామా ఆపమంటూ అరిచారు’

Sep 9 2019 8:56 PM | Updated on Sep 9 2019 8:56 PM

Woman On Wheelchair Asked To Stand At Delhi Airport - Sakshi

న్యూఢిల్లీ : వెన్నెముక గాయంతో బాధ పడుతున్న తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇబ్బందులకు గురిచేశారని అమెరికా జాతీయురాలు విరాళీ మోదీ(28) ఆరోపించారు. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్న విరాళీ... 2006లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా తీవ్ర గాయాపాలయ్యారు. ఈ క్రమంలో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. దాంతో ప్రయాణాల్లో భాగంగా తనతో పాటు ఎల్లప్పుడూ వీల్‌ చెయిర్‌ను వెంటతీసుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించిన తనకు చేదు అనుభవం ఎదురైందని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. 

ఈ మేరకు...‘ నాకున్న అసౌకర్యం కారణంగా వీల్‌ చెయిర్‌ను కార్గోలో పంపిస్తారు. నాకు సహాయం చేసేందుకు, నన్ను సీట్లో కూర్చోబెట్టేందుకు పోర్టర్‌ సహాయం తీసుకుంటాను. అయితే మీ మహిళా అధికారి కారణంగా నాకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. లేచి నిలబడాలంటూ పదే పదే నన్ను ఆమె ఇబ్బంది పెట్టారు. నేను నిలబడలేనని నా సహాయకులు చెప్పినా ఆమె వినలేదు. కావాలంటే నన్ను తనిఖీ చేసుకోమని సూచించినా వినలేదు. సీనియర్‌ అధికారిని తీసుకు వచ్చి నన్ను చూపించారు. నా పాస్‌పోర్టు చూసిన తర్వాత నేను వీల్‌ చెయిర్‌ యూజర్‌ను అనే విషయం వాళ్లకు బోధపడింది. అప్పటి దాకా డ్రామా ఆపమంటూ ఇష్టం వచ్చినట్లుగా నన్ను నానా మాటలు అన్నారు’ అంటూ భద్రతా విభాగం అధిపతి(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ చీఫ్‌)కి చేసిన ఈ-మెయిల్‌ను విరాళీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో కూడా తనకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయంటూ విరాళీ ఆరోపించగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమె మాటలను కొట్టిపారేశారు.

Advertisement
 
Advertisement
Advertisement