ఆగస్టు 15 నాడే ఉరీ లో ఉగ్రదాడి జరిపేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆర్మీవార్గాలు చెప్తున్నాయి.
భారత స్వాతంత్రదిన వేడుకలు జరిగే ఆగస్టు 15 నాడే ఉరీ లో ఉగ్రదాడి జరిపేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆర్మీవార్గాలు చెప్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే సమయంలోనే దాడులు జరపాలని ముష్కరులు యత్నించారని, అయితే అప్రమత్తమైన ఆర్మీ బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ జెయిషే మహమ్మద్ కు చెందిన ఫిడాయీన్ జట్టులోని నలుగురు సభ్యులను ఉరీ సమీపంలోని మయాన్ ప్రాంతంలో మట్టుబెట్టడంతో వారి ప్రయత్నాలు విఫలమైనట్లు పేర్కొన్నారు. అయితే అదే ఉగ్రవాద సంస్థ సభ్యులు మరో ప్రయత్నంగా సెప్టెంబర్ 16 రాత్రి ఉరీ ప్రాంతంలోని ఆర్మీ బ్రిగేడ్ లోకి చొరబాటు ప్రారంభించి, 18 తెల్లవారు జామున 4 గంటల సమయంలో దాడి చేసి, రెండో ప్రయత్నంలో విజయవంతమైనట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
మిలిటెంట్లు దట్టమైన అడవుల్లోని సాయుధదళాల సమీపానికి చేరుకునేందుకు మొక్క జొన్న పంటచేలను ఆధారంగా చేసుకొని ఉండొచ్చని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అయితే సాయుధ పోరాటానికి సిద్ధమైన ఈ ప్రత్యేక ఫిడాయీన్ సభ్యులు ఆర్మీ హెయిర్ స్టైల్ తో పాటు, గెడ్డం నున్నగా గీసుకొని ఉన్నారని.. ఈ ప్రయత్నం..స్థానికులకు టెర్రర్ అనుమానం రాకుండా ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకునేందుకుకే అయి ఉండొచ్చని ఆర్మీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న 10 డోగ్రా యూనిట్ ఆర్మీ క్యాంపులోకి చొరబడ్డ ఉగ్రవాదుల దాడి వెనుక అంతర్గత పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాన్నీ తోసిపుచ్చలేమని సైన్యాధికారి ఒకరు చెప్తున్నారు.