ఆ రైళ్లలో సూపర్‌ఫాస్ట్‌ బాదుడు | Travelling in 48 more trains gets costlier, thanks to 'superfast' levy | Sakshi
Sakshi News home page

ఆ రైళ్లలో సూపర్‌ఫాస్ట్‌ బాదుడు

Nov 6 2017 3:29 PM | Updated on Nov 6 2017 3:29 PM

Travelling in 48 more trains gets costlier, thanks to 'superfast' levy - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రైల్వేలను లాభాల ట్రాక్‌పైకి ఎక్కించాలనే తపన ప్రయాణీకులకు పెనుభారమవుతోంది. తాజాగా 48 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తూ చార్జీలు పెంచడంతో ప్రయాణీకులపై అదనపు భారం పడింది. అయితే ఆయా రైళ్ల సగటు వేగాన్ని కేవలం 5 కిలోమీటర్లు పెంచి అధికారులు చేతులుదులుపుకున్నారు. రైళ్లు సకాలంలో నడిచే పరిస్థితి లేకపోవడం, వేగాన్ని పెద్దగా పెంచకపోవడంతో అప్‌గ్రేడేషన్‌తో ప్రయాణీకులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.

నవంబర్‌ 1న వెల్లడించిన టైమ్‌టేబుల్‌ ప్రకారం అప్‌గ్రేడ్‌ చేసిన రైళ్ల సగటు వేగాన్ని గంటకు 50 కిమీ నుంచి 55 కిమీకి పెంచారు. పొగమంచు కారణంగా ఉత్తరాదికి వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సీజన్‌ ఆరంభంలో సూపర్‌ఫాస్ట్‌ లెవీని విధించడం ప్రయాణీకులకు ఏరకంగానూ ఉపయోగపడదని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ధి వంటి ప్రీమియర్‌ సర్వీసులు సహా అన్ని రైళ్లూ ఆలస్యంగా నడుస్తున్నాయి.

సూపర్‌ఫాస్ట్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్‌ చేసిన రైళ్లలో కొత్తగా ప్రయాణీకుల కోసం అదనంగా ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదు. అయినా ప్రయాణీకులు స్లీపర్‌ క్లాస్‌కు అదనంగా రూ 30, సెకండ్‌, థర్డ్‌ ఏసీలపై రూ 45, ఫస్ట్‌ ఏసీ క్లాస్‌పై రూ 75 సూపర్‌ఫాస్ట్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.సూపర్‌ఫాస్ట్‌ లెవీగా అదనంగా రూ 70 కోట్లు సమీకరించాలని రైల్వేలు అంచనా వేస్తున్నాయి.48 ట్రెయిన్లను సూపర్‌ఫాస్ట్‌ జాబితాలో చేర్చడంతో మొత్తం ఈ విభాగంలో చేరిన రైళ్ల సంఖ్య 1072కు పెరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement