అధికారులకు ఫస్ట్క్లాస్ విమానయానం కట్ | To cut costs, government bars first class air travel for officials | Sakshi
Sakshi News home page

అధికారులకు ఫస్ట్క్లాస్ విమానయానం కట్

Oct 30 2014 9:10 PM | Updated on Aug 20 2018 9:16 PM

దేశ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందువల్ల దుబారాను వెంటనే తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది.

దేశ ఖజానా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అందువల్ల దుబారాను వెంటనే తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించింది. ప్రభుత్వాధికారులు ఇకమీదట పొదుపు చర్యలు పాటించి తీరాల్సిందేనని కుండ బద్దలుకొట్టింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడం, ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించడం ఇక మానుకోవాలని స్పష్టం చేసింది. ప్రణాళికేతర వ్యయాన్ని కనీసం 10 శాతం మేర తగ్గించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక శాఖ విధించింది. జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 12.19 లక్షల కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో, అనవసర వ్యయాలను కచ్చితంగా తగ్గించాలని ఓ మెమోలో తెలిపింది.

విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వాధికారులు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించకూడదని, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయకూడదని.. వీటిపై నిషేధం ఉందని తెలిపారు. అలాగే ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు, సదస్సులు కూడా నిర్వహించకూడదన్నారు. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం వివిధ తరగతుల్లో ప్రయాణించేందుకు అధికారులకు అర్హత ఉన్నా.. ప్రస్తుత పరిస్థితిని బట్టి వాటిని మానుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement