రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి? | There was an ‘LTTE mole’ in Rajiv Gandhi’s home: Book | Sakshi
Sakshi News home page

రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి?

Aug 5 2014 10:43 AM | Updated on Sep 2 2017 11:25 AM

రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి?

రాజీవ్ ఇంట్లోనే ఎల్టీటీఈ మనిషి?

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చడానికి చాలా ముందుగానే కుట్రపన్నిన ఎల్టీటీఈ వర్గాలు ఏకంగా 10 జన్పథ్ నివాసంలోకే ప్రవేశించాయా?

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చడానికి చాలా ముందుగానే కుట్రపన్నిన ఎల్టీటీఈ వర్గాలు ఏకంగా 10 జన్పథ్ నివాసంలోకే ప్రవేశించాయా? ఆయన ఎప్పుడు, ఎక్కడ ఎలా తిరుగుతారన్న విషయాలన్నింటినీ అక్కడినుంచే గ్రహించాయా? అవునంటోంది ఓ పుస్తకం. గతంలో రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆర్డీ ప్రధాన్ ఈ పుస్తకం రాశారు. సోనియాగాంధీ కూడా అలాగే అనుకుంటున్నారని ఆయన అంటున్నారు.

''రాజీవ్ హత్యకేసులో చాలామంది నిందితులను అరెస్టుచేసి, కొంతమందిపై నేరం నిరూపించినా.. పూర్తి వాస్తవం బయటకు రాలేదని అనిపిస్తోంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న చాలామంది పెద్దమనుషులు కలిసి చేసిన కుట్రలో భాగమే ఈ హత్య అని తెలుస్తోంది. 10 జన్పథ్ నివాసంలో ఉన్నవాళ్లే కీలక సమాచారాన్ని బయటకు చేరవేశారు. ఆ సమయానికి 1991 లోక్సభ ఎన్నికల ప్రచారానికి అమేథీలో ఉన్న సోనియాగాంధీకి కూడా ఇలాంటి అనుమానమే ఉంది'' అని ప్రధాన్ ఆ పుస్తకంలో రాశారు.

హత్యకు దారితీసిన భద్రతాలోపాలపై జస్టిస్ వర్మ కమిషన్ విచారణ జరపగా, మొత్తమ్మీద భద్రతాలోపాలను జైన్ కమిషన్ పరిశీలించింది. కేవలం తమిళనాడు సర్కారుకు మాత్రమే ఎల్టీటీఈ కుట్రల గురించి తెలిసే అవకాశం ఉందని, కానీ ఈ విషయంలో ఐబీ, తమిళనాడు గవర్నర్ (భీష్మ నారాయణ్ సింగ్) విఫలమైనట్లు తనకు అనిపిస్తోందని ప్రధాన్ చెప్పారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు ప్రధాన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement